ఎగసిపడనున్న టీడీపీ మద్యం ‘సిండికేట్’ అలలు
విశాఖపట్నం, చీరాల బీచ్లలో 12 ప్రదేశాల గుర్తింపు
ఇతర జిల్లాల్లోనూ జనవరి నాటికి బీచ్ బార్లు
ముసాయిదా ఖరారు చేసిన ఎక్సైజ్ శాఖ
ఇక ఉత్తర్వులే తరువాయి
సాక్షి, అమరావతి: బీచ్లలో ప్రశాంత వాతావరణన్ని చిదిమేసి, మందుబాబుల చిందులుగా మార్చేలా చంద్రబాబు ప్రభుత్వం బీచ్బార్ల ఏర్పాటుకు సన్నాహాలను వేగవంతం చేసింది. ప్రజాసంఘాల నుంచి వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను బేఖాతరు చేస్తూ బీచ్లలో మద్యాన్ని ఏరులై పారించేందుకు ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను తొందరపెడుతోంది. ఇందుకోసం ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో బీచ్ బార్ల విధి విధానాలను ఎక్సైజ్ శాఖ సూత్రప్రాయంగా ఖరారు చేసింది. ఇందుకోసం ముసాయిదాను సైతం రూపొందించించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది.

అన్ని రకాల మద్యం
బీచ్ బార్లలో ఏయే కేటగిరీల మద్యం విక్రయిస్తారనే దానిపై ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. సాధారణ బార్లలో విక్రయిస్తున్న అన్ని రకాల మద్యం బీచ్ బార్లలో కూడా విక్రయిస్తారని తేల్చిచెప్పింది. బీచ్ బార్లలో కేవలం బీరు మాత్రమే విక్రయిస్తారని కొందరు చెబుతున్నది అవాస్తవమని ఎక్సైజ్ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ అంశంపై అధికారిక ఉత్తర్వుల్లో స్పష్టత ఇవ్వనున్నట్టు పేర్కొన్నాయి.
వైజాగ్, చీరాలలో తొలి దశలో 12 బార్లు
వైజాగ్, చీరాలలో పైలట్ ప్రాజెక్టు కింద బీచ్ బార్లను ఏర్పాటు చేస్తారు. విశాఖపట్నంలో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఉన్న బీచ్లలో ఏడు ప్రాంతాలను ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తోంది. దాంతోపాటు యారాడ బీచ్ వద్ద కూడా ఓ బీచ్ బార్ ఏర్పాటును ప్రతిపాదిస్తున్నారు. చీరాలలోనూ నాలుగు ప్రాంతాల్ని గుర్తించారు.
మొత్తం విశాఖపట్నం, చీరాలలో 12 చోట్ల బీచ్ బార్ల ఏర్పాటుకు అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. వాటిలో ఎన్ని చోట్ల బార్లు ఏర్పాటు చేయాలన్నది ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిర్ణయిస్తారని ముసాయిదాలో పేర్కొంది. విశాఖపట్నం, బాపట్ల జిల్లా ఎక్సైజ్ అధికారులతో చర్చించి ఎక్సైజ్ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుంది.
జనవరి నాటికే ఇతర జిల్లాల్లోనూ..
పైలట్ ప్రాజెక్టు మొదలు పెట్టిన రెండు మూడు నెలల్లోనే రాష్ట్రంలోని ఇతర తీర ప్రాంతాల్లోనూ బీచ్ బార్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, పశి్చమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లో అనువైన ప్రదేశాలపై నివేదిక రూపొందించాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించింది.
వచ్చే ఏడాది జనవరి నాటికే రాష్ట్రంలో బీచ్ బార్లను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా రాష్ట్రంలో 974 కి.మీ. తీరప్రాంతాన్ని టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి వేదికగా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా ఉందని స్పష్టమవుతోంది.


