గిరిజనులకు ‘పట్టా’భిషేకం      | AP Government Arrangements For Distribution Of Forest Cultivation Rights Documents | Sakshi
Sakshi News home page

గిరిజనులకు ‘పట్టా’భిషేకం     

Jul 10 2020 7:31 AM | Updated on Jul 10 2020 7:31 AM

AP Government Arrangements For Distribution Of Forest Cultivation Rights Documents - Sakshi

ఈ అటవీ భూములకే పట్టాలు ఇవ్వనున్నారు

సీతంపేట: ఎన్నో ఏళ్లుగా అటవీసాగు హక్కు పత్రాల కోసం ఎదురుచూస్తున్న గిరిజనానికి మరికొద్ది రోజు ల్లో మేలు జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గిరిజనులకు అటవీ సాగు హక్కు   కలి్పంచాలనే సంకల్పంతో ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 12 ఏళ్ల క్రితం పంపిణీ జరిగింది. అనంతరం మళ్లీ ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ (రిజర్వ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌) పట్టాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఐటీడీఏ పరిధిలో సబ్‌ప్లాన్‌ మండలాల్లో 3,336 ఎకరాల్లో 2 వేల 97మందికి అటవీసాగు హక్కు పత్రాలు అందనున్నాయి. ఈ దిశగా అటవీశాఖ, ఐటీడీఏ కసరత్తు చేస్తోంది. టీడీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన అటవీచట్టానికి ప్రస్తుత ప్రభుత్వం జీవం పోస్తోంది.

అటవీప్రాంతంలో సాగు చేసే గిరిజన రైతులకు సాగు హక్కు పత్రాలు ఇచ్చి వారికి అన్ని రకాల హక్కులు కలి్పంచడానికి కేంద్ర ప్రభుత్వం 2006లో అటవీహక్కుల చట్టాన్ని ప్రవేశపెట్టింది. 2005కు ముందు సాగు హక్కులో ఉన్నవారందరికీ పట్టాలు ఇవ్వాల్సి ఉంది. దీనిప్రకారం గతంలో రెండుసార్లు పట్టాలు ఇచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో అందరికీ న్యాయం జరగలేదనే ఆరోపణలున్నాయి. టీడీపీ ప్రభుత్వం అటవీహక్కుల చట్టాన్ని నీరు గార్చిందనే ఆరోపణలున్నాయి.

ఐటీడీఏ పరిధిలో 20 సబ్‌ప్లాన్‌ మండలాలున్నాయి. వీటి పరిధిలో 301 గ్రామ పంచాయతీలుండగా 1406 గ్రామాలున్నాయి. సుమారు 40 వేలకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. కొండపోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబాలు దాదాపు 10 వేలు ఉంటాయి. కొంతమందికి సాగు చేసుకోవడానికి పట్టాలు వంటివి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిగా సాగుపై హక్కులు లేకపోవడం, సకాలంలో రుణాలు పొందలేని స్థితిలో ఉన్నారు. అటువంటి వారికి పట్టాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున సాగుహక్కు పత్రాలు ఇవ్వనున్నారు. పట్టాల తయారీ వంటివాటిపై ఇప్పటికే ఐటీడీఏలో కసరత్తు జరుగుతోంది.  

గిరిజనులకు రుణాలు 
ఈ పట్టాల ద్వారా గిరిజనులు బ్యాంకుల్లో రుణాలు సైతం పొందవచ్చు. తద్వారా పంటలు పండించుకోడానికి అవకాశమేర్పడుతుంది. పోడు వ్యవసాయం వల్ల అడవులు దెబ్బతింటున్నాయని అటవీశాఖ ఎప్పుడు పడితే అప్పుడు అడ్డుకుంటోంది. అడవిని నమ్ముకుని బతికే గిరిజన రైతులకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ చట్టం కింద పట్టాలు ఇవ్వడంతో పోడు వ్యవసాయానికి ఇక అడ్డంకులు ఉండవు. హక్కు పత్రాలు ఉంటే అటవీ అధికారుల నుంచి ఇబ్బందులు కూడా ఉండవు. గతంలో ఏనుగులు వంటివి పంటలను నష్టపరిస్తే పరిహారం వచ్చేది కాదు. పట్టా చేతికి వస్తే పరిహారం కూడా వస్తుంది.  

ఇదీ పరిస్థితి... 
మండలాల వారీగా అటవీసాగు హ క్కు పత్రాలు ఇవ్వడానికి ఇప్పటికే జాబితా సిద్ధమైంది. కొత్తగా ఎవరై నా దరఖాస్తులు ఇస్తే వాటిని కూడా స్వీకరిస్తున్నారు.  

మా కష్టాలు తీరనున్నాయి 
నాకు రెండు ఎకరాలకు పైగా కొండపోడు వ్యవసాయం ఉంది. దానిపై పూర్తిగా హక్కు లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నా ను. భర్త మృతి చెందడంతో కూలీనాలీ చేసు కుని బతుకుతున్నాను. పట్టా వస్తే రుణం కూడా వస్తుంది. పంట లు పూర్తిగా పండించుకుని కుటుంబాన్ని పోషించుకోవచ్చు.  
–సవర లక్ష్మి, అక్కన్నగూడ 

పట్టాల పంపిణీకి చర్యలు 
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున గిరిజనులకు అటవీ సాగు హక్కు పత్రాలు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నాం. సాగు హక్కు పత్రాల పంపిణీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ వేగవంతం చేశాం. 2 వేల పైచిలుకు పట్టాలు ఇవ్వడానికి జిల్లా స్థాయి కమిటీలో ఆమోదమైంది. అలాగే మరో 500 వరకు దరఖాస్తులు వచ్చాయి. అవి పరిశీలనలో ఉన్నాయి.  
–సందీప్‌ కృపాకర్, జిల్లా అటవీశాఖాధికారి 

సీఎం జగన్‌ గిరిజనుల పక్షపాతి  
గిరిజనులకు సాగు హక్కు పత్రాలు లేని వారందరికీ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఆయన గిరిజనుల పక్షపాతి. అటవీసాగు హక్కు పత్రాలు వస్తే గిరిజనులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. గత టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో గిరిజనులకు అన్యాయం జరిగింది. 
–విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement