80% ఉద్యోగాలు స్థానికులకే.. 

80 percent of jobs are for locals - Sakshi

20 శాతం పోస్టులు ఓపెన్‌ కేటగిరీలో భర్తీ 

జిల్లా యూనిట్‌గా స్థానికత నిర్థారణ 

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయో పరిమితిలో ఐదేళ్ల సడలింపు 

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగ నియామకాలపై స్పష్టత ఇచ్చిన సర్కారు 

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో భర్తీ చేయనున్న 1,26,728 ఉద్యోగాల్లో 80 శాతం పోస్టులను స్థానికులకే కేటాయిస్తారు. మిగిలిన 20 శాతం పోస్టులను ఓపెన్‌ కేటగిరీలో భర్తీ చేస్తారు. జిల్లాను యూనిట్‌గా తీసుకుని అభ్యర్థుల స్థానికతను గుర్తిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏడేళ్ల కాలంలో నాలుగేళ్లపాటు ఏ జిల్లాలో చదువుకుంటారో సదరు అభ్యర్థిని స్థానిక కేటగిరీగా గుర్తిస్తారు. ఆ జిల్లాకు కేటాయించిన మొత్తం పోస్టుల్లో 80 శాతం వారితోనే భర్తీ చేస్తారు. ఒక జిల్లాలో ఎక్కువ కాలం చదివి.. వేరే జిల్లాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే ఓపెన్‌ కేటగిరీలో 20 శాతం మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఈ విషయాలను స్పష్టంగా పేర్కొంది.
 
వయో పరిమితి.. జీతం ఇలా 
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితి 18నుంచి 42 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గరిష్ట వయో పరిమితిలో ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్ల సడలింపు అమలు చేస్తారు. సంబంధిత ఉద్యోగంలో ఇప్పటికే ఔట్‌ సోర్సింగ్‌లో పని చేస్తున్న వారికి వయో పరిమితిలో వారి సర్వీసు కాలానికి సడలింపు ఇస్తారు. గరిష్ట వయో పరిమితిలో అత్యధికంగా ఐదేళ్ల సడలింపు ఇస్తారు. జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో జరిగే రాత పరీక్ష  అనంతరం ఎంపికయ్యే అభ్యర్థికి మొదటి రెండేళ్లు రూ.15 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించి, ఆ తర్వాత పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగి హోదా కల్పిస్తూ బేసిక్‌ శాలరీ అమలు చేస్తారు. పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ పోస్టులకు రూ.15,030 నుంచి రూ.46,060 మధ్య బేసిక్‌ శాలరీ నిర్ణయించగా.. మిగిలిన పోస్టులకు రూ.14,600 నుంచి రూ.44,870 మధ్య బేసిక్‌ శాలరీగా అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు.  

దరఖాస్తు విధానం 
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం మూడు వెబ్‌ పోర్టల్స్‌ను ఏర్పాటు చేసింది. ఏ వెబ్‌ పోర్టల్‌ను ఓపెన్‌ చేసినా.. ఒకే తీరున మొత్తం ఐదు విభాగాలతో కూడిన స్క్రీన్‌ కనిపిస్తుంది. మొదట నోటిఫికేషన్‌ అన్న విభాగం ఉంటుంది. దానికి కింద క్లిక్‌ చేస్తే.. భర్తీ చేసే ఉద్యోగాల వారీగా వివరాలు ఉంటాయి. ఏ ఉద్యోగానికి సంబంధించిన పేరు మీద క్లిక్‌ చేస్తే.. ఆ ఉద్యోగానికి సంబంధించి జిల్లా వారీగా ఖాళీలు, విద్యార్హత, పరీక్ష విధానం వంటి సమగ్ర వివరాలు ఉంటాయి. వాటి ఆధారంగా అభ్యర్థి తనకు ఆసక్తి ఉన్న ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. స్టెప్‌–1లో పేర్కొన్న రెండో కాలంలో ఉన్న బటన్‌ క్లిక్‌ చేసి అభ్యర్థి పేరు, ఆధార్‌ వివరాలు లేదా ఇతర గుర్తింపు కార్డు వివరాలతోపాటు మొబైల్‌ నంబర్, ఫొటోను అప్‌లోడ్‌ చేస్తే సంబంధిత అభ్యర్థి ఫోన్‌ నంబర్‌కు అతని దరఖాస్తుకు సంబంధించి కేటాయించిన ఐడీ వివరాలు మెసేజ్‌ అందుతుంది.

ఆ ఐడీ వివరాల ప్రకారమే అతడు ఆన్‌లైన్‌లో తన దరఖాస్తును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టెప్‌ –2 విభాగంలోని బటన్‌ను క్లిక్‌ చేస్తే.. అభ్యర్థి మొబైల్‌కు మెసేజ్‌ ద్వారా అందిన ఐడీ నంబర్‌ వివరాలు నమోదుకు బాక్స్‌లు ఉంటాయి. ఐడీ నంబర్‌ నమోదుతో పాటు తాను ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారనే వివరాలను అక్కడ నమోదు చేస్తే పూర్తి దరఖాస్తు ఫారం నమూనా ఓపెన్‌ అవుతుంది. తప్పులు లేకుండా దానిని నింపాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారం పూర్తి చేసినట్టు క్లిక్‌ బటన్‌ నొక్కే ముందువరకు తప్పులను సరిచేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తులో పేర్కొన్న వివరాలను మార్చడానికి వీలుండదు. నాల్గవ కాలమ్‌గా అభ్యర్థి దరఖాస్తుకు సంబంధించి చెల్లించాల్సిన ఫీజుల వివరాలు ఉంటాయి. అక్కడ బటన్‌ క్లిక్‌ చేసి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చివరన గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోల వివరాలు ఉన్నాయి. అభ్యర్థికి ఏమైనా సమాచారం కావాలంటే అక్కడ తెలుసుకోవచ్చు. 

పోస్టుల వారీగా పరీక్ష విధానం.. వివరాలు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top