టూరిజానికి 10 వేల ఎకరాలు | 10 thousand acres for tourism | Sakshi
Sakshi News home page

టూరిజానికి 10 వేల ఎకరాలు

Apr 23 2015 3:53 AM | Updated on Aug 14 2018 11:24 AM

టూరిజానికి  10 వేల ఎకరాలు - Sakshi

టూరిజానికి 10 వేల ఎకరాలు

రాజధాని ల్యాండ్ పూలింగ్ పిడుగు జిల్లాపైనా పడనుంది.

ల్యాండ్ పూలింగ్ రెండో దశ

కృష్ణానదికి ఉత్తరాన భూసమీకరణ
జిల్లాలోని నందిగామ,కంచికచర్ల ప్రాంతాల ఎంపిక
క్యాపిటల్ పరిధి పెంపు
మంగళగిరి, విజయవాడల్లో ప్రత్యేక అభివృద్ధికి సీసీడీఎంసీ
రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం

 
సాక్షి ప్రతినిధి, విజయవాడ : రాజధాని ల్యాండ్ పూలింగ్ పిడుగు జిల్లాపైనా పడనుంది. ఇప్పటివరకు కృష్ణానదికి దక్షిణం వైపున గుంటూరు జిల్లాలోని పలు మండలాల్లో రాజధాని కోసం ప్రభుత్వం భూ సమీకరణ చేసింది. త్వరలో రెండో దశ కింద టూరిజం అభి వృద్ధి చేయడానికి కృష్ణాజిల్లాలో కూడా భూములు సమీకరించనుంది. ఇందుకోసం కృష్ణానదికి ఉత్తరం వైపున ఐదు నుంచి పది వేల ఎకరాలు తీసుకునేందుకు నిర్ణయించినట్లు రాష్ట్ర మున్సిపల్ మంత్రి పి.నారాయణ బుధవారం చెప్పారు. ఇదికాక నందిగామ, కంచికచర్ల ప్రాంతాల్లో కొంత భూమిని సమీకరించేందుకు బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు పూర్తిస్థాయిలో వెల్లడి కావాల్సి ఉంది. కంచికచర్ల, నందిగామ ప్రాంతాల్లో రాజధాని ఉద్యోగులకు క్వార్టర్లు కట్టించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాజధాని నుంచి కృష్ణానది మీదుగా వారధులు నిర్మించేందుకు నిర్ణయం తీసుకోవడంతో అక్కడి నుంచి కంచికచర్ల, నందిగామ ప్రాంతాలకు వెళ్లిరావడం తేలిగ్గా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. హైదరాబాద్‌కు వెళ్లే రహదారి కావడంతో ఇక్కడి భూములకు మంచి డిమాండ్ ఉంది. రాజధాని తుళ్లూరు కావడం వల్ల కూడా ఇక్కడి భూములకు మంచి ధర వచ్చింది. రైతులు తమ భూములకు మంచి ధర వచ్చిందనే ఆనందంలో ఉన్న సమయంలో ఇక్కడ కూడా ల్యాండ్ పూలింగ్ కింద భూములు తీసుకుంటారని చూచాయగా తెలియడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

క్యాపిటల్ పరిధి 375 చ.కి.మీటర్లకు పెంపు...
క్యాపిటల్‌గా ఇప్పటికే 225 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని నిర్ణయించారు. దీనిని 375 చదరపు కిలోమీటర్ల పరిధికి పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు క్యాపిటల్ పరిధిలో ఉండే విజయవాడ, మంగళగిరి పట్టణాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ కమిటీ (సీసీడీఎంసీ)ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. దీనివల్ల కూడా నగరంలో కొన్ని భూములు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. కార్పొరేషన్‌కు చెందిన ఖాళీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలు సేకరించే పనిలో సీఆర్‌డీఏ అధికారులు ఉన్నారు.
 
 
భవానీ ద్వీపం చాలదా?
టూరిజం అభివృద్ధి కోసం భవానీద్వీపం చాలదా.. అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు. కృష్ణా జిల్లాలో ల్యాండ్ పూలింగ్ జరిపేందుకు మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలను ఆయన తప్పుపట్టారు. ఇప్పటికే తుళ్లూరు మండలంలో ఏ స్థాయిలో భూములు తీసుకోవాలో ఆ స్థాయిలో తీసుకున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు చెబుతున్న ప్రకారం నదికి ఉత్తరం వైపున భూములు తీసుకుంటే వాస్తు శాస్త్రం అంగీకరించదు కదా అంటూ ఛలోక్తి విసిరారు.     - వడ్డే శోభనాద్రీశ్వరరావు,మాజీ మంత్రి

 
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే
రాజధాని పేరుతో ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ ప్రక్రియ కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే. రాజధాని పరిధిలోని రైతులను, కూలీలను, కౌలుదారులను, వ్రుత్తిదారులను రోడ్డున పడేసే కుట్ర జరుగుతోంది. నిర్దిష్టమైన ప్రాజెక్టు కోసం ముందుగా ప్రభుత్వ భూములను, తరువాత చౌడు, తక్కువ పంట పండే భూములను సేకరించాలి. వీటన్నింటినీ పట్టించుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా పాలకవర్గ ప్రతినిధులు, అనుచరుల ప్రమేయం కోసం భూ సేకరణ చేస్తోంది. హనుమాన్ సుగర్స్ కోఆపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీకి చెందిన 118 ఎకరాల భూమిని కేవలం రూ.10 కోట్లకు గోకరాజు గంగరాజుకు కట్టబెట్టారు.

కార్మికుల పొట్టగొట్టి ప్రస్తుతం ఆ ప్రాంతంలో మెడికల్ కాలేజీ కట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తక్కువ ధరకు భూములను కట్టబెట్టి తదుపరి ఎన్నికలకు నిధుల సేకరణ, ఓట్ల కొనుగోళ్లు కోసం భూ సేకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. పారిశ్రామిక అభివ ృద్ధికి మేము వ్యతిరేకం కాదు. అయితే నిరుద్యోగులకు ఉపాధి కల్పన, ఇతర అంశాలపై పాలకులకు ద ృష్టి లేదు.    
 - ఎం.హరిబాబు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు
 
చంద్రబాబుది భూ దాహం
ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని పేరుతో లక్షల ఎకరాల భూమిని సమీకరిస్తున్నారు. అవసరానికి మించి భూమిని సేకరించి యోగా గురువులు, బాబాలు, కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు లక్ష ఎకరాలు సేకరించి భూ బ్యాంక్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయనది భూ దాహం. రైతుల చేతుల్లో సెంటు భూమి లేకుండా లాక్కునేందుకు సిద్ధమయ్యారు. దీనిని రైతు సంఘం తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అడ్డగోలుగా భూములు తీసుకోవడం సరికాదు.    
- రావుల వెంకయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement