రాజంపేట రూరల్ : శ్రీకామాక్షి సమేత త్రేతేశ్వరస్వామికి కడప నగరానికి చెందిన దివంగత జానపాటి పిచ్చయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రూ.4లక్షల విలువైన నాగపడిగను అందజేశారు. ఆదివారం జానపాటి పిచ్చయ్య సతీమణి లక్షుమ్మ తమ కుటుంబ సభ్యులతో కలిసి మండల పరిధిలోని అత్తిరాలలో కొలువైన త్రేతేశ్వరుడి సన్నిధికొచ్చి దేవస్థాన చైర్మెన్ పూల నాగమణికి దీనిని అందజేశారు. దాతలకు దేవస్థాన చైర్మన్ ప్రత్యేక పూజలు చేయించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జానపాటి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
నేడు పీజీఆర్ఎస్
కడప సిటీ : జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్ సభాభవన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించనున్నట్లు డీఆర్వో మల్లికార్జునుడు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల, మున్సిపల్ స్థాయిల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలతో హాజరై వినతిపత్రాలు అందజేయాలని కోరారు. అలాగే గతంలో సమర్పించిన అర్జీల వివరాలు తెలుసుకోవడానికి 1100 కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవచ్చని, పాత అర్జీలకు సంబంధించిన రశీదు ఉంటే తీసుకురావాలని సూచించారు.
సేవల స్పందనకు
క్యూఆర్ కోడ్
కడప సిటీ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు తమ స్పందన తెలియజేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పీజీఆర్ఎస్ కేంద్రాలను సందర్శించే పౌరుల నుంచి అభిప్రాయాన్ని సేకరించేందుకు జిల్లా, మండల స్థాయి ిపీజీఆర్ఎస్ కేంద్రాలలో, వివిధ మాధ్యమాల్లో ప్రజల అభిప్రాయ సేకరణకు క్యూ ఆర్ కోడ్ను ప్రదర్శించాలని నిర్ణయించామన్నారు. జిల్లా, మండల స్థాయి పీజీఆర్ఎస్ కేంద్రాల ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాలలో ప్రజలకు స్పష్టంగా కనిపించేలా క్యూఆర్ కోడ్ ప్రముఖంగా ప్రదర్శించాలని అధికా రులను ఆదేశించారు. అర్జీల స్థితిగతులు తెలుసుకొనేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1100 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు.
నేడు డయల్ యువర్
‘సీఎండీ’
కడప కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 7వ తేది ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా రాయలసీమ జిల్లాల నుంచి వినియోగదారులు 8977716661 నంబర్కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు.
సర్కిల్ స్థాయిలో ‘డయల్ యువర్ ఎస్ఈ
డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమంతోపాటు సర్కిల్ స్థాయిలోనూ ప్రతి సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకూ డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో విద్యుత్ సమస్యలను సూపరింటెండెంట్ ఇంజినీర దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన వారు 08562–242457, అన్నమయ్య జిల్లాకు చెందిన వారు 9440817449 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.
గండి ఆదాయం రూ.91.26లక్షలు
చక్రాయపేట: గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో జరిగిన నాలుగు శ్రావణ శనివారోత్సవాల సందర్భంగా ఆలయానికి రూ. 91,26,462లు ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయకమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. తొలి శనివారం రూ.15,51,669లు, రెండవ శనివారం రూ.19,85,127లు, మూడో శనివారం రూ.29,00,343లు, చివరి శనివారం రూ.26,89,323లు ఆదాయం వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈమొత్తం తాత్కాలిక హుండీలు, ఆర్జిత సేవాటికెట్లు, తలనీలాల టికెట్లు,అన్నదానం తాత్కాలిక షాపులు, లడ్డు పులిహోర ప్రసాదాల విక్రయం,స్పెషల్ దర్శనం తదితరాల ద్వారా వచ్చిందని వివరించారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించిన అధికారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.


