● మిలాద్ జులూస్లో మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా
● పాల్గొన్న నగర ప్రముఖులు, జనం
కడప సిటీ : మహమ్మద్ ప్రవక్త (సొ.అ.వ) చూపిన మార్గం అనుసరణీయమని మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా తెలిపారు. బుధవారం మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాదున్నబీ సందర్భంగా కడప నగరంలో ఆంధ్రప్రదేశ్ మర్కజి మిలాద్ జులూస్ కమిటీ ఆధ్వర్యంలో జులూస్ (ర్యాలీ) నిర్వహించారు. ఈ ర్యాలీ నగరంలోని అల్మాస్పేటవద్దగల ఇనాత్ ఖాన్ తాలిం నుంచి ప్రారంభమై ఆగాడి, మోచంపేట, మట్టి పెద్దపులి, చెన్నూరు బస్టాండ్, 1వ గాంధీ బొమ్మ సర్కిల్, పొట్టి శ్రీరాములు సర్కి ల్, 7 రోడ్లు మీదుగా ఎన్టీఆర్ కూడలి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్బీఅంజద్బాషా మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధనలు ఎప్పటికీ నిజాయితీగా ఉండాలని సూచిస్తాయన్నారు. సత్యం మనిషిని మంచి మార్గంలో నడిపిస్తుందని వివరించారు. ఈ ర్యాలీలో మత గురువు హజరత్ వలీవుల్లా సాహెబ్, హజరత్ మహమ్మద్ అలీ బాగ్దాదీ, నగర ముస్లిం ప్రముఖులు అమీర్బాబు, సలావుద్దీన్, మగ్బూల్బాషతోపాటు పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు.
రక్తదాన శిబిరానికి విశేష స్పందన
మిలాదున్నబీ సందర్భంగా జూలూస్ అనంతరం గుంత బజార్ మసీదులో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో దాదాపుగా వందమంది రక్తదానం చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మహమ్మద్ అలీ బాగ్దాది, ఖూన్కా రిష్టా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు తారీఖ్, అల్లా బకాష్, సలావుద్దీన్, అలీ షేర్ రాయల్ కరిముల్లా, జేకే యూత్ ఖాదర్బాషా తదితరులు పాల్గొన్నారు.
శాంతియుత ర్యాలీ
జమ్మలమడుగు : మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పలగాడీ వీధికి చెందిన ఆస్థానయే గౌసియా మత గురువు ప్రభుత్వ ఖాజీ సయ్యద్ షా గౌస్పీరాఖాద్రీ, పీఠాధిపతి సయ్యద్షా తాహీర్పీరాఖాద్రీల ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు నరేష్బాబు, కులాయప్ప తదితరులు బందోబస్తు నిర్వహించారు. అదేవిధంగా జామియా మసీదు పీఠాధిపతి సయ్యద్షా సాదిక్పాషా ఖాద్రీ ఆధ్వర్యంలో మసీదులో మహమ్మద్ ప్రవక్త జ్ఞాపికల ప్రదర్శన నిర్వహించారు.
కమలాపురం : జష్నే మిలాద్–ఉన్–నబీ జెండా ఊరేగింపు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం పీఠాధిపతి హజరత్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రి ఆధ్వర్యంలో, దర్గా కన్వీనర్ షేక్ ఇస్మాయిల్ పర్యవేక్షణలో ఆస్థాన–ఏ–జహీరియా నుంచి దర్గా–ఏ–గఫారియా వరకు మిలాద్–ఉన్–నబీ జెండా ఊరేగింపు అశేష భక్త జన సందోహం నడుమ భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పీఠాధిపతి సోదరులు దస్తగిరి స్వామి, మౌలానా స్వామి, గౌస్పాక్, జియా, ఇస్మాయిల్, సర్ఫరాజ్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


