● కడపలో టీడీపీ నేతల అధికార దర్పం
● కార్పొరేషన్కు ఆదాయం గుండు సున్నా
సాక్షి టాస్క్ఫోర్స్ : కడప శాసన సభ్యురాలు ఆర్. మాధవిరెడ్డి జన్మదినం సందర్భంగా కడప నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడ చూసినా శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. అయితే ఆమె అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఏ ఒక్కరూ కార్పొరేషన్కు ఒక్క రూపాయి చెల్లించకుండా, అను మతి తీసుకోకుండా ఆ ఫ్లెక్సీలను ఊరంతా ఏర్పాటు చేశారు. నిబంధనలు పాటించి నగరపాలక సంస్థ అనుమతి పొంది, చలానాలను చెల్లించి ఉంటే కార్పొరేషన్కు ఆదాయం సమకూరేది.. కానీ అందరూ అధికార దర్పంతో ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారే తప్ప నగరపాలక సంస్థకు చిల్లిగవ్వ కూడా చెల్లించలేదు. ఇతర పార్టీల వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఆగమేఘాలపై అక్కడ వాలి పోయి వాటిని తొలగించే టౌన్ప్లానింగ్ అధికారు లు, సిబ్బంది.. ఈ ఫ్లెక్సీలపై ఉదాసీనంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేతలకు కార్పొరేషన్లోని ఇద్దరు ఉన్నతాధికారుల అండ పుష్కలంగా ఉండటం వల్లే ఇలా అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి.
రూల్స్.. గీల్స్ జాన్తానై
సాధారణంగా ఎవరైనా నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే కార్పొరేషన్కు ఒక అర్జీ పెట్టుకోవాలి. ఏ సైజు ఫ్లెక్సీలు ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారో అందులో తెలపాలి. అక్కడ రోడ్డుకు అడ్డంగా ఉన్నా, వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందని భావించినా అధికా రులు అనుమతి ఇవ్వరు.. అలా ఏం లేకుంటే అనుమతి ఇస్తూ.. ఎంత చలానా అవుతుందో చెప్పి చెల్లించమంటారు. అలా చెల్లించిన తర్వాతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ చలానాకు సంబంధించిన రశీదును ఫ్లెక్సీపై ముద్రించాలి. కానీ అధికార పార్టీ నేతలు ఈ నిబంధనలేవీ పాటించడం లేదు. వారు ఎక్కడ ఏర్పాటు చేయాలనుకుంటే అక్కడ ఇష్టారీతిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చాలా చోట్ల ఇవి రోడ్లకు అడ్డంగా ఉన్నాయి.
చలానా చెల్లించిన ‘ఒకే ఒక్కడు’: ఆగష్టు 27న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి జన్మదినం కూడా ఉంది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే నిబంధనల పేరు చెప్పి అనుమతి ఇవ్వకపోవడం వల్ల వారంతా సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా వైఎస్సార్సీపీ యువజన నాయకుడు రహీమ్ మాత్రమే ఐదు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు చలానా చెల్లించి అనుమతి తీసుకున్నారు.


