● విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు ● తల్లిదండ్రుల ఆందోళన
చక్రాయపేట: వైఎస్సార్ కడప జిల్లా చక్రాయపేట మండలంలోని గండి గురుకుల పాఠశాల (డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం బాలురు)లో దారుణం చోటు చేసుకుంది.7వ తరగతి చదువుతున్న అఖిలానందన్ అనే విద్యార్థిని పాఠశాలలో సైన్స్ టీచర్గా పని చేస్తున్న జావీద్ విచక్షణారహితంగా కొట్టాడు. విద్యార్థి శరీరంపై వాతలు పడి పొంగాయి. నొప్పి భరించ లేక ఏడుస్తుండటంతో గమనించిన ప్రిన్సిపల్ సురేంద్రబాబు పాఠశాల సిబ్బంది హుటాహుటిన వేంపల్లెకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు బంధువులు వచ్చి సదరు ఉపాద్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ పరిస్థితిని గుర్తించి సదరు ఉపాధ్యాయుడితో విద్యార్థి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పించాడు. ఈసంఘటన బుధవారం సాయంత్రం పాఠశాలలో చోటు చేసుకోగా గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.వేంపల్లె మండలం నందిపల్లెకు చెందిన అఖిలానందన్ గండి గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం సైన్స్ టీచర్ జావీద్ 7వ తరగతికి చెందిన ఏ, బి సెక్షన్ల విద్యార్థులను కలుపుకొని బోధన చేస్తున్నాడు. ఈసమయంలో అఖిలానందన్ మరో విద్యార్థి కొట్టు కుటుకుంటున్న వియాన్ని గుర్తించిన సైన్స్ టీచర్ ఆగ్రహంతో సదరు విద్యార్థిని గట్టిగా కొట్టాడు.దీంతో సమస్య ఉత్పన్నం అయింది.ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పించడంతో సమస్య సద్దుమణిగింది.
బాధాకరం: ప్రిన్సిపాల్ సురేంద్రబాబు
సైన్స్ టీచర్ అఖిలానందన్ను ఉద్దేశపూర్వకంగా కొట్ట లేదు.అయితే పొరపాటున జరిగి ఈసంఘటన బాధాకరం.ఉపాధ్యాయుడితో తలిలదండ్రులకు క్షమాపణ చెప్పించాను.ఇకపై ఇలా జరగకుండా చూస్తాను. గతంలో ఇక్కడ ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదని ఆయన వివరించాడు.
విచారణకు ఆదేశం
గండి గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చక్రాయపేట ఎంఈవో–2 రవికిరణ్ను ఆదేశించినట్లు డీసీవో జయ తెలిపారు,అలాగే సదరు ఉపాధ్యాయుడికి మెమో కూడా ఇచ్చినట్లు ఆమె తెలిపారు.సంఘటనపై ఉన్నతాధికారులకు కూడా నివేదించినట్లు చెప్పారు. విచారణ అనంతరం నివేదికను డీసీవోతోిపాటు డీఈవోకు సమర్పిస్తామని చక్రాయపేట ఎంఈవో–2రవికిరణ్ తెలిపారు
విద్యార్థి అఖిలానందన్, శరీరంపై కనిపిస్తున్న గాయం


