జమ్మలమడుగు : తక్కువ ధరకే బంగారం వస్తోందని ఆశపడిన ఓ వ్యక్తి మోసపోయిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. మండల పరిధిలోని మోరగుడిలో భార్యాభర్తలు అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగించేవారు. ఈ నేపథ్యంలో మోరగుడిలోని సుబ్బరాయుడు అనే వ్యక్తికి చెందిన ఇంటిని బాడుగకు ఇవ్వాలని ఆయనను కోరారు. ఇంటికి మరమ్మతులు జరుగుతున్నాయని తర్వాత చూద్దాం అంటూ ఆయన చెప్పారు. దీంతో వారు తమ వద్ద బంగారు బిస్కెట్లు ఉన్నాయని, వాటిని తక్కువ ధరకే ఇస్తామని సుబ్బరాయుడును నమ్మబలికారు. ముందుగా బంగారం బిస్కెట్లను పగులగొట్టి అందులోని రెండు గ్రామాల బంగారం తీసి టెస్టింగ్ చేసుకోమని సుబ్బరాయుడుకు ఇచ్చారు. బంగారు దుకాణంలోకి వెళ్లిన ఆయన నిజమైన బంగారం అని తేల్చుకున్నారు. మొదట రెండు బిస్కెట్లకు రూ.12 లక్షలు డిమాండ్ చేయగా చివరకు రూ.4.30 లక్షలకు బేరం కుదుర్చుకుని ఏక మొత్తంగా డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకుని ఆ దంపతులు పరారయ్యారు. బిస్కట్లను తీసుకుని బంగారు దుకాణంలో చూపించగా అవి నకిలివని తెలడంతో బాధితుడు తన కుటుంబంతో కలిసి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వివాహిత అనుమానాస్పద మృతి
కడప అర్బన్ : వివాహమైన ఆరు నెలలకే ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కడపలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు ఏ–2 నగర్కు చెందిన షేక్షావల్లి భార్య ఖాజాబీ (26) ఈ నెల 4న తన నివాసంలో ఉరి వేసుకుని మృతి చెందింది. మృతురాలి తండ్రి మహబూబ్ సాహెబ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, జమ్మలమడుగుకు చెందిన ఖాజాబీకి 6 నెలల క్రితం కడపలోని ఏ–1 నగర్కు చెందిన షేక్షావల్లితో వివాహమైంది. వివాహం జరిగినప్పటి నుంచి గర్భం దాల్చలేదని, సంతానం కలుగుతుందా లేదా అంటూ భర్తతో పాటు అత్తింటి వారు మానసికంగా వేధించారని ఆయన ఆరోపించారు. వేధింపులను భరించలేక ఖాజాబీ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతురాలి తండ్రి మహబూబ్బాషా ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సమగ్రంగా విచారించి బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలను తీసుకుంటామనీ కడప టూటౌన్ సీఐ శ్రీహరి తెలియజేశారు.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్రవాహనం
ఎర్రగుంట్ల : పట్టణంలోని వేంపల్లె రోడ్డుపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన ప్రతాప్ జగన్నాఽఽథ్ సింగ్ ఠాగూరు (46) మృతి చెందగా రాహుల్కూమార్ తీవ్రంగా గాయపడినట్లు సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని మల్లాపూర్కు చెందిన ప్రతాప్ జగన్నాఽథ్ సింగ్ ఠాగూర్, రాహుల్ కుమార్ స్థానిక జువారీ సిమెంట్ పరిశ్రమమలో కాంట్రాక్ట్ కార్మికులుగా పని చేస్తున్నారు. వీరిద్దరూ బుధవారం బైక్పై ఎర్రగుంట్లకు వచ్చిన తిరిగి పరిశ్రమ వద్దకు బయలుదేరారు. వేంపల్లె రోడ్డు మీదుగా వెళుతుండగా విద్యుత్ సబ్స్టేషన్ వద్దకు రాగనే ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ప్రమాదంలో ప్రతాప్ జగన్నాఽథ్ ఠాగూర్, రాహుల్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ ప్రతాప్ జగన్నాథ్ సింగ్ ఠాగూర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రాహుల్కుమార్ స్వల్ప గాయలతో బయటపడ్డారు. కాంట్రాక్టర్ రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


