ఎమ్మెల్యే వరదకు అధిష్టానం నుంచి కాల్‌ | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే వరదకు అధిష్టానం నుంచి కాల్‌

Aug 1 2026 1:43 AM | Updated on Aug 1 2026 1:43 AM

ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి ఆ పార్టీ అధిష్టానం నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. నాలుగు రోజుల క్రితం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, లంచం ఇవ్వనిదే ప్రభుత్వ అధికారులు ఏ పని చేయడం లేదని విమర్శించారు. నియోజకవర్గంలో మట్కా, గుట్కా, క్రికెట్‌ బెట్టింగ్‌ లాంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారని తెలిపారు. అధికార పార్టీలో ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఈ మేరకు అధిష్టానం నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. సోమవారం అమరావతిలోని పార్టీ కార్యాలయానికి ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వచ్చి ఈ వివరణ ఇవ్వాలని చెప్పినట్లు సమాచారం.

దరఖాస్తుల ఆహ్వానం

కడప సెవెన్‌రోడ్స్‌ : భారత ప్రభుత్వ యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2025 సంవత్సరానికి టెన్జింగ్‌ నార్గే జాతీయ సాహస అవార్డు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని స్టెప్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి బీవీ ప్రసాదరావు తెలియజేశారు. ఈ అవార్డుకు మూడు సంవత్సరాల్లో భూమి, నీరు (సముద్రం), గాలి వంటి వాటిపై చేసిన సాహస కార్యకలాపాలలో అత్యుత్తమ విజయాలు సాధించిన వారిని పరిగణనలోకి తీసుకుంటారు. సాహస క్రీడల్లో తమను తాము అంకితం చేసుకుని, నైపుణ్యము ప్రదర్శించిన వ్యక్తులకు జీవితకాల సాఫల్యం కింద ఈ అవార్డును ఏటా రాష్ట్రపతి చేతుల మీదుగా బహుకరిస్తారు. ఈ అవార్డు కోసం హెచ్‌టీటీపీఎస్‌//అవార్ట్స్‌.జీఓవీ.ఇన్‌ ద్వారా ఆగస్టు 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

డెంగీ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

కడప రూరల్‌ : కలిసికట్టుగా డెంగీ రహిత సమాజాన్ని నిర్మిద్దామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ యుగంధర్‌ అన్నారు. శుక్రవారం స్థానిక ఇందిరా నగర్‌లో డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన డీఎంహెచ్‌ఓ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనారోగ్య సమస్యలు తలెత్తితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement