సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు(శుక్రవారం) పులివెందులకు వెళ్లనున్నారు. ఆయనకు వరుసకు పెదనాన్న, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సొంత పెదనాన్న అయిన వైఎస్ ఆనంద్రెడ్డి అంత్యక్రియల్లో జగన్ పాల్గొననున్నారు.
వైఎస్ ఆనంద్రెడ్డి(87) గురువారం పులివెందులలో మృతి చెందారు. కొంతకాలంగా ఆయన వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతివార్త తెలుసుకున్న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పులివెందులలోని ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు వైఎస్ ప్రకాష్రెడ్డి, వైఎస్ ప్రతాప్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, వైఎస్ మధురెడ్డి, ఆనంద్రెడ్డి కుమారుడు వైఎస్ రాజేష్రెడ్డి, కుమార్తెలు సాధన, సునీత తదితరులు ఆయన భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఆనంద్రెడ్డికి చివరి నివాళులు అర్పించారు.
సమాధుల తోటలో అంత్యక్రియలు
వైఎస్ ఆనంద్రెడ్డి అంత్యక్రియలను శుక్రవారం మధ్యాహ్నం పులివెందుల డిగ్రీ కళాశాల రోడ్డులోని వైఎస్ కుటుంబ సభ్యుల సమాధుల తోటలో నిర్వహించనున్నట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ నేతల సమక్షంలో అంత్యక్రియలు జరగనున్నాయి.


