ప్రభుత్వాస్పత్రుల్లో రోజువారీ ఎంత ఆక్సిజన్ అవసరమో అంచనా లేదు
ఆక్సిజన్ కొనుగోళ్లు, వినియోగంపై పర్యవేక్షణ కరువు
విశాఖలో ఆక్సిజన్ కొనుగోల్మాల్ వ్యవహారంతో లోపాలు బట్టబయలు
ఆక్సిజన్ పైప్లైన్ నిర్వహణలో నిర్లక్ష్యం.. లీకేజీలతో గాల్లో కలుస్తున్న ప్రజాధనం
మూలనపడ్డ పీఎస్ఏ ప్లాంట్లు
ఆక్సిజన్ కొనుగోలుకు డీఎంఈ, డీఎస్హెచ్లో ఏటా రూ.50 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిర్వహణలో ప్రణాళిక లేమి, నిధుల వినియోగంలో కరువైన పారదర్శకత, పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.కోట్లలో గండిపడుతోంది. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్హెచ్) పరిధిలోని ఆస్పత్రులకు ఏటా రూ.50 కోట్ల మేర బడ్జెట్ కేటాయిస్తుంటారు. అయితే ఆక్సిజన్ కొనుగోళ్లు, వినియోగంపై కనీస తనిఖీలు, పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడం అక్రమార్కులకు వరంగా మారుతోంది. విశాఖ కేజీహెచ్లో ఇటీవల వెలుగు చూసిన ఆక్సిజన్ కొనుగోళ్లలో అవకతవకల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా బోధనాస్పత్రుల్లో నెలకొన్న అస్తవ్యస్థ విధానాలకు అద్దం పడుతోంది.
ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిపడే రోగులకు అందాల్సిన ఆక్సిజన్ గాల్లో కలిసిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల కేజీహెచ్లో పర్యటించిన డీఎంఈ కార్యాలయ బృందం ఈ అంశాన్ని ప్రధానంగా గుర్తించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని బోధనాస్పత్రుల్లో ఇదే దుస్థితి నెలకొంది. ఇక ఆస్పత్రుల్లో ఏ రోజు ఎంత ఆక్సిజన్ వచ్చింది? ఎంత వినియోగించారు? లీకేజీల వల్ల ఎంత నష్టం జరిగింది? అని పరిశీలించే ఆడిటింగ్ వ్యవస్థ లేదు. దీంతో ఆస్పత్రుల్లోని కొందరు అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమీషన్ల కోసం ఇష్టారాజ్యంగా ఆక్సిజన్ కొంటున్నట్లు ఆరోపణలున్నాయి.
ఉదాహరణకు విశాఖ కేజీహెచ్లో 2023–24తో పోలిస్తే 2024–25లో ఏకంగా 32 శాతం మేర ఆక్సిజన్ కొనుగోలు పెరిగింది. వైద్యసేవల్లో పెద్దగా వృద్ధి లేకపోయినప్పటికీ ఆక్సిజన్ కొనుగోలులో మాత్రం ఏకంగా 32 శాతం వృద్ధి నమోదు అనుమానాలకు తావిస్తోంది. విజయవాడ జీజీహెచ్లో 2023–24తో పోలిస్తే 2024–25లో వైద్యసేవలు తగ్గుముఖం పట్టాయి. కానీ ఇక్కడ 2023–24తో సమానంగానే 2024–25లో ఆక్సిజన్ కొనుగోలు చేశారు. మరోవైపు విశాఖలో వెలుగు చూసిన ఆక్సిజన్ కొనుగోల్మాల్ వ్యవహారంలో వైద్యశాఖ చేపట్టిన విచారణ మీద విమర్శలు వస్తున్నాయి.
ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా, వెంటిలేటర్ల వాడకం, రోగులకు శ్వాస సంబంధిత మద్దతు ఇవ్వడంలో అనస్థీషియా డాక్టర్ కీలకంగా వ్యవహరిస్తారు. గాలినుంచి నేరుగా ఆక్సిజన్ను వేరుచేసి అందించే (ప్రెషర్ స్వింగ్ అడ్జార్షన్–పీఎస్ఏ) ప్లాంట్లు అనస్థీషియా వైద్యుల పరిధిలోకి వస్తాయి. అయితే విశాఖలో విచారణకు డీఎంఈ ఏర్పాటుచేసిన బృందంలో పీఎస్ఏ ప్లాంట్లకు సంబంధించిన సాంకేతికత తెలిసిన అనస్థీషియా వైద్యుడు ఒక్కరు కూడా లేరు. ఆస్పత్రిలో ఆక్సిజన్ ఎలా వాడతారో సరైన అవగాహన లేని వారిని బృందంలో వేసి మమ అనిపించారని ఫిర్యాదులు వస్తున్నాయి.
మొక్కుబడిగా మాక్డ్రిల్
రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పీఎస్ఏ ప్లాంట్లను చంద్రబాబు సర్కార్ పూర్తిగా పడుకోబెట్టేసింది. కోవిడ్ వంటి విపత్తులు ఎదురైన సమయంలో ప్రాణవాయుకు కొరత ఏర్పడకుండా ముందుచూపుతో రాష్ట్రాలకు కేంద్రం పీఎస్ఏ ప్లాంట్లు మంజూరు చేసింది. వీటి పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఆక్సిజన్ సరఫరా వ్యవస్థను పర్యవేక్షిస్తూ ఉండాలని గతంలో ఆదేశించింది.
ఇప్పుడు ఈ ప్లాంట్లను నిర్లక్ష్యం చేసి ప్రైవేట్గా ఆక్సిజన్ కొనుగోలు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అంతేగాకుండా కోవిడ్ కేసులు పెరుగుతున్న సందర్భంలో కేంద్రం నిర్వహించే మాక్డ్రిల్స్లో పీఎస్ఏ ప్లాంట్లు వినియోగంలో ఉన్నట్టు రాష్ట్ర వైద్యశాఖ ఫోటోలు అప్లోడ్ చేస్తోంది. గతేడాది కోవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో జూన్లో చేపట్టిన మాక్డ్రిల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇదే తంతు నడిచిందని వైద్యశాఖ వర్గాలే చర్చించుకుంటున్నాయి.


