● రూ.45 లక్షల విలువ చేసే 6 కిలోల గంజాయి, ఒక బైకు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం
● పోర్టర్ యాప్ ద్వారా బుకింగ్స్.. బెంగళూరు కేంద్రంగా గంజాయి విక్రయం
● వివరాలను వెల్లడించిన
ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
రాయచోటి / రామాపురం : గంజాయి ఇతర మాదకద్రవ్యాల అక్రమరవాణా, వ్యాపారులపై మరింత కఠినచర్యలు చేపడతామని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తీవ్రంగా హెచ్చరించారు. రాయచోటి డివిజన్ పరిధిలోని రామాపురం ఫారెస్ట్ చెక్పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ.45 లక్షల విలువ చేసే 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న వివరాలను ఎస్పీ బుధవారం రాయచోటిలో మీడియాకు వివరించారు. అక్రమరవాణాలో భాగస్వాములైన ముగ్గురు అంతర్ రాష్ట్ర నిందితులను అరెస్టు చేసి వారి నుంచి తరలించడానికి సిద్ధంగా ఉంచిన ఆరు కిలోల గంజాయి, ఐదు సెల్ఫోన్లు, ఒక బైకును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడి సమాచారం మేరకు వైజాగ్కు చెందిన బోడన్నా, రాయచోటికి చెందిన ఖాదర్బాషా, బీహార్కు చెందిన ప్రకాష్లు అక్రమరవాణాలో ప్రధాన పాత్రధారులుగా గుర్తించామన్నారు. వీరి ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. వీరు వైజాగ్ నుంచి రాయచోటికి తరలిస్తూ స్థానికంగా విక్రయించడంతో పాటు గుజరాత్, బీహార్, బెంగళూరు ప్రాంతాలకు తరలించనున్నట్లు పోలీసు విచారణలో తేలిందన్నారు.
యాప్ ద్వారా బుకింగ్స్
అక్రమ గంజాయి వ్యాపారులు అందుబాటులో ఉన్న ఆదునిక పరిజ్ఞానంతో వ్యాపారాన్ని విస్తరించారన్నారు. ఈ క్రమంలోనే పోర్టర్ యాప్ ద్వారా బుకింగ్స్ చేయడం, విక్రయాలను సాగిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా బెంగళూరు కేంద్రంగా గంజాయి విక్రయాలను అధికంగా కొనసాగిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. గంజాయి, మాదకద్రవ్యాల సమాచారం ఉంటే ప్రజలు వెంటనే డయల్ 100/112 లేదా టోల్ఫ్రీ 1972కు కాల్ చేసి పోలీసులకు సహకరించాలని ఎస్సీ విజ్ఞప్తి చేశారు. గంజాయి ముఠాను అరెస్టు చేసిన పోలీసులు, అధికారులకు నగదు రివార్డును ఎస్పీ అందజేశారు. మీడియా సమావేశంలో రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, లక్కిరెడ్డిపల్లి సీఐ కృష్ణంరాజునాయక్, రామాపురం ఎస్ఐ కెబి శివకుమార్, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.


