– వైస్సార్సీపీలో క్రియాశీలక భాద్యతలు
సాక్షి ప్రతినిధి, కడప : వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ(సీఈసీ) మెంబర్గా మాజీ మేయర్ కొత్తమద్ధి సురేష్ బాబును ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. జిల్లా పరిషత్ చైర్మన్గా, రెండు సార్లు కడప మేయర్గా..పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అపార అనుభవం ఉన్న సురేష్ బాబును సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా మంగళవారం నియమించారు. బీసీ నాయకుడిగా సర్పంచ్ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన సురేష్ బాబు సేవలను వినియోగించుకునేందుకు అధిష్టానం క్రియాశీలక నిర్ణయం తీసుకుంది. ఆయన నియామకం పట్ల మాజీ మంత్రి ఎస్బీ అంజాద్ బాషా తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
డీసీఈబీ సెక్రటరీగా
చంద్రశేఖర్రావు
కడప ఎడ్యుకేషన్: డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు(డీసీఈబీ) సెక్రటరీగా జమ్మలమడుగు మండలం ఎస్. ఉప్పలపాడు జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న దాయిపూలే చంద్రశేఖర్రావు నియమితులయ్యారు. గతంలో డీసీఈబీ సెక్రటరీగా పనిచేస్తున్న విజయబాస్కర్రెడ్డి గత నెల 28వ తేదీ పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో దాయిపూలే చంద్రశేఖర్రావును డీఈఓ నియమించారు. ఈ మేరకు ఆయన డీసీఈబీ సెక్రటరీగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతో డీసీఈబీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు.
8న క్రికెట్ జట్ల ఎంపిక
కడప వైఎస్ఆర్ సర్కిల్: ఈ నెల 8న 2026–27 సంవత్సరంఅండర్ –19, సీనియర్స్ పురుషుల క్రికెట్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేన్ కార్యదర్శి అవ్వారు రెడ్డి ప్రసాద్ తెలిపారు. క్రీడాకారులు ఆధార్ కార్డు , టెన్త్ మార్క్ల లిస్ట్, బర్త్ సర్టిఫికెట్(ఫారం 5), పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, ఒరిజినల్ తో పాటు ఒక సెట్ జిరాక్స్లను తీసుకురావాలన్నారు. క్రీడాకారులు తమ కిట్ బ్యాగులు కూడా తీసుకురాలని కోరారు. ఎంపికలు ఉదయం 8 గంటలకు వైఎస్ఆర్ఆర్ ఏసీఏ స్టేడియంలో జరుగుతాయని తెలిపారు. 2007 సెప్టెంబరు 1 తర్వాత జన్మించిన వారు ఎంపికలకు అర్హులని చెప్పారు.
గుర్రంకొండ: మార్కెట్యార్డుల్లోని టమాటా మండీల్లో చిన్నక్రీట్ల విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా మార్కెటింగ్శాఖ ఏడీఏ త్యాగరాజు అన్నారు. మంగళవారం అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మార్కెట్యార్డులోని టమాటా మండీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈసందర్బంగా 25 కేజీల క్రీట్ల స్థానంలో 15కేఈల క్రీట్ల విధానం ఎంతవరకు అమలవుతొందో పరిశీలించారు. అనంతరం వ్యాపారులతో మాట్లాడుతూ యార్డులో 58 మండీలకుగాను 39 మండీలు నిర్వహించడం లేదన్నారు. మిగిలిన 19 మండీలకుగాను ఎనిమిది మండీలలో మాత్రమే చిన్నక్రీట్ల విధానాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. గతంలో జిల్లా కలెక్టర్తోపాటు మార్కెట్కమిటీ అధికారుల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈనెల 2 నుంచి తప్పనిసరిగా చిన్నక్రీట్లు అమలు చేయాల్సి ఉందన్నారు. అప్పట్లో వ్యాపారులు దీనికి అంగీకరించారన్నారు. అయితే ఇంకా కొంతమంది చిన్న క్రీట్ల విధానం అమలు చేయకపోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఆరు రోజుల్లోగా మండీలలో అన్ని చిన్న క్రీట్లు ఏర్పాటు చేసుకొంటామని వ్యాపారులు సమాధానమిచ్చారు.


