కడప సెవెన్రోడ్స్/ఒంటిమిట్ట : చంద్రగ్రహణం కారణంగా జిల్లాలో పలు ఆలయాలు మూసివేశారు. దేవునికడప శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయం, గడ్డిబజారు బాలాజీ ఆలయం, శ్రీ విజయదుర్గాదేవి ఆలయంతోపాటు పలు ఆలయాలు మూసివేశారు. అలాగే టీటీడీ పరిధిలోని నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయం, ఒంటమిట్ట శ్రీ కోదండ రామాలయం, జమ్మలమడుగు శ్రీ నారాపుర వెంకటేశ్వరస్వామి ఆలయం వంటివి మూసివేశారు. చంద్రగ్రహణం నేపధ్యంలో ఆలయాలు మూసివేయాలంటూ తిరుమల–తిరుపతి దేవస్థానం సర్క్యులర్ జారీ చేసింది. చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.20 నుంచి 6.47 గంటల వరకు కొనసాగింది. వైకానస, పంచరాత్ర, శివ ఆగమ ఆలయాలు గ్రహణ సమయంలో మూసివేయాలంటూ సర్క్యులర్లో పేర్కొన్నారు. దీంతో దేవునికడప ఆలయం ఉదయం 9 గంటలకు మూసివేశారు. తిరిగి రాత్రి 7.30 గంటలకు తెరిచి ఆలయ శుద్ధి నిర్వహించారు. ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని ఉదయం 9 గంటలకు మూసివేసి రాత్రి 7 గంటలకు ఆలయ శుద్ధి చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయాన్ని ఉదయం 9 గంటలకు మూసివేసి బుధవారం తెల్లవారుజామున ఆలయాన్ని శుద్ధిపరిచి 8.15 గంటలకు స్వామి వారికి నైవేద్యం అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తామని అక్కడి ఆలయ ఇన్స్పెక్టర్ తెలిపారు.


