ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి
కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 106 ఫిర్యాదులు(పీజీఆర్ఎస్) కు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్న్లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నడవలేని వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. వారి వద్దకు జిల్లా ఎస్పీ స్వయంగా వెళ్లి ఫిర్యాదులను స్వీకరించారు. న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్. సుధాకర్, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


