
●ముగ్గురూ..కూటమి నేతలే కదా!
సాక్షి ప్రతినిధి, కడప: ఆయన కూటమి ఎమ్మెల్యే. పూటకో మాట.. రోజుకో రంగు మార్చడంలో ఆరి తేరిన వ్యక్తి. ‘ఆది’నుంచి.. నియంతృత్వ ధోరణే. స్వపక్షనేతలతో కయ్యానికి దిగుతూ విపక్షంపై వేలెత్తి చూపించడంలో దిట్ట. అక్రమ ఆదాయం కోసం అర్రులు చాస్తూ వైఎస్సార్సీపీని బూచిగా చూపెట్టి అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నవ్వుల పాలవుతున్నారు. ఓవైపు ప్రభుత్వ పెద్దల వద్ద పట్టుకోల్పోగా మరోవైపు క్షేత్రస్థాయిలో సమర్థించుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆయనే జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆది.
● జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై ఇటీవల కాలంలో ప్రధానంగా మూడు వివాదాలు తెరపైకి వచ్చాయి. గండికోట రిజర్వాయర్ ఆధారంగా వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో అదానీ హైడ్రో పవర్ ప్రాజెక్టు సివిల్ పనులు తన బంధువులను పంపించి అడ్డుకున్నారు. అక్కడున్న సిబ్బందిపై దాడులకు తెగబడ్డారు. మిషనరీ ధ్వంసం చేశారు. ఇక రెండోది ఆర్టీపీపీ నుంచి సరఫరా అవుతోన్న ఫ్లయాష్ ట్యాంకర్లు అడ్డుకున్నారు. తాము చెప్పిన సూచించిన ట్యాంకర్లు నుంచే ఫ్లైయాష్ సరఫరా చేయాలని హుకుం జారీ చేశారు. తాజాగా అల్ట్రాటెక్ సిమెంటు పరిశ్రమకు సరఫరా చేస్తున్న ముడి ఖనిజం రవాణా చేస్తున్న లారీలను అడ్డగించి సిమెంటు ఉత్పత్తికి ఆటంకం కల్గించారు. ఈ మూడు ఘటనల వ్యవహారంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వైఎస్సార్సీపీ వర్గీయులంటూ ఆ పార్టీ పేరు వాడుకొని ఎదురుదాడి చేశారు.
ఫ్లైయాష్ ట్రాన్సుపోర్టులో టీడీపీ ఎమ్మెల్యే...
ఆర్టీపీపీ నుంచి ప్రతిరోజు 3,926 టన్నులు ఫ్లైయాష్ ఉత్పత్తి అవుతోంది. దానిని 25 ప్రైవేటు కంపెనీలకు, 15 సిమెంటు పరిశ్రమలకు కేటాయిస్తున్నారు. ప్రైవేటు సంస్థలకు టన్ను రూ.550 చొప్పున, సిమెంటు పరిశ్రమలకు టన్ను రూ.410 చొప్పున ఇచ్చేలా అగ్రిమెంటు చేసుకున్నారు. తాడిపత్రిలో ఉన్న ఎల్అండ్టీ సిమెంటు పరిశ్రమకు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ఆస్మిత్రెడ్డి తండ్రి జేసీ ప్రభాకర్రెడ్డికి చెందిన ట్యాంకర్లు ఫ్లైయాష్ సరఫరా చేస్తున్నాయి. తాడిపత్రికి కూడా తమ వర్గీయుల ట్యాంకర్లు ద్వారానే ఫ్లైయాష్ సరఫరా చేయాలంటూ ఎమ్మెల్యే మంకుపట్టు పట్టారు. ఈక్రమంలో జేసీ ప్రభాకర్రెడ్డి ట్యాంకర్లకు లోడింగ్ చేయకుండా అడ్డుకున్నారు. అదే స్థాయిలో జేసీ ప్రభాకరరెడ్డి ప్రతిఘటించారు. ఈవ్యవహారం ఉద్రికత్తల నేపధ్యంలో మరోమారు సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
అల్ట్రాటెక్ ముడి ఖనిజం ట్రాన్సుపోర్టు
కాంట్రాక్టులో ఎంవీ రమణారెడ్డి..
ఎర్రగుంట్ల మండలం చిలంకూరు పరిధిలో ఉన్న అల్ట్రాటెక్ (ఐసీఎల్) సిమెంటు పరిశ్రమకు ఫ్లయాష్, సున్నపురాయి ఇతర ముడి ఖనిజం సరఫరా, ప్యాకింగ్ ప్లాంట్ కాంట్రాక్టు పనులు 40 ఏళ్లుగా మాజీ మంత్రి మైసూరారెడ్డి సోదరుడు ఎంవీ రమణారెడ్డి చేస్తున్నారు. ఆ పనులన్నీ తమ వర్గీయులకే ఇవ్వాలంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కొంతకాలంగా సిమెంటు పరిశ్రమ యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా ఎలాంటి వివాదం లేని కారణంగా ఆ పరిశ్రమ యాజమాన్యం నుంచి ఎమ్మెల్యే డిమాండ్కు ఆశించిన స్థాయిలో మద్దతు కొరవడింది. దాంతో ఏకంగా తన వర్గీయులతో ట్రాన్సుపోర్టు వాహనాలను అడ్డుకున్నారు. సిమెంటు ఉత్పత్తికి కావాల్సిన ముడి ఖనిజం సరఫరా నిలిచి పోవడంతో ఉత్తత్పి ఆగిపోయింది. ఇలాంటి తరుణంలో ఆ సంస్థ యాజమాన్యం హైలెవెల్లో ఫిర్యాదు చేసింది. దాంతో సీఎంఓ జోక్యం చేసుకుంది. కలెక్టరేట్ ఆగమేఘలపై స్పందించి అడ్డుకున్నవారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఎలాంటి ఆటంకం లేకుండా వ్యవహరించింది.
●రమేష్నాయుడు బీజేపీ ఎంపీ...
వైఎస్సార్సీపీని బూచిగా చూపెట్టి తన చర్యను సమర్థించుకున్న బీజేపీ ఎమ్మెల్యే ఆది
యాజమాన్యంతో సంప్రదించాల్సిన ధోరణి అదేనా!
ఎమ్మెల్యేకి ప్రజాస్వామ్య పద్ధతులు ఉండవా...
నిలదీస్తున్న ప్రజాస్వామ్యవాదులు
ఈ ఘటనల్లోని ముగ్గురు ‘కూటమి’నాయకులే. ఒకరేమో బీజీపీ పార్లమెంటు సభ్యుడు , మరొకరు తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే, ఇంకొకరు చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థించిన మాజీ మంత్రి మైసూరారెడ్డి సోదరుడు. ఈముగ్గురు కూడా వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేని వారే. పైగా కూటమి నాయకులే. కాగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ‘మొగుణ్ణి కొట్టి మొగసాల ఎక్కినట్లు’గా స్వపక్షనేతలపై కాలుదువ్వుతూనే వైఎస్సార్సీపీని బూచిగా చూపెడుతున్నారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఆదాయ మార్గాలు తమకు మాత్రమే ఉండాలి. జమ్మలమడుగు ప్రాంతం తమదే.. తాము ప్రాతినిథ్యం వహిస్తున్న ఏరియాలో ఇతరులెవ్వరూ కాంట్రాక్టు పనులు చేయవద్దనే నియంతృత్వ ధోరణిని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రదర్శిస్తున్నా రని విశ్లేషకులు ఘాటుగా విమర్శిస్తున్నారు.
గండికోట ప్రాజెక్టు ఆధారంగా కొండాపురం మండలంలోని దొబ్బుడుపల్లె, రావికుంట, తిరువాలయపల్లె గ్రామాలతోపాటు మైలవరం మండలంలోని బొగ్గులపల్లె ఆదానీ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు ప్రభుత్వ అనుమతులు దక్కాయి. తొలివిడతగా రూ.1800 కోట్లతో నిర్మాణ పనులకు ఆసంస్థ శ్రీకారం చుట్టింది. టెండర్లల్లో అనకాపల్లె ఎంపీ రమేష్నాయుడుకు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు సివిల్ పనులు దక్కాయి. క్షేత్రస్థాయిలో పనులు మొదలు పెట్టారు. ఈపనులను తమ వర్గీయులే చేయాలంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పట్టుబట్టారు. ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరుడు శివనారాయణరెడ్డి, మరో సోదరుడు కుమారుడు రాజేష్రెడ్డి నేతృత్వంలో మందీ మార్బలంతో వెళ్లి దొబ్బుడుపల్లె వద్ద చేపడుతున్న నిర్మాణ పనుల్లో విధ్వంసం సృష్టించారు. ఆదానీ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అడ్డుకుంటున్న వైనాన్ని రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధి రాజేష్నాయుడు సీఎం చంద్రబాబునాయుడుకు మొరపెట్టుకున్నారు.

●ముగ్గురూ..కూటమి నేతలే కదా!