సాక్షి, వైఎస్సార్ జిల్లా : దేశంలో ఒకే ఒక్కడు వైఎస్ జగన్ అని.. తన జెండా, తన ఎజెండాతో మాత్రమే ఎన్నికలకు వెళ్లిన పార్టీ వైఎస్సార్సీపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గుర్తింపు పొందిన 6 జాతీయ పార్టీలు కూడా ఏదో ఒక సందర్భంలో పొత్తులు పెట్టుకున్నాయని.. ఎప్పుడైతే ఒక రాజకీయపార్టీ మరో జెండాతో జతకడుతుందో అప్పుడే సొంత బలం లేదని తేలిపోతుంది. వారి పాలనలో ఆలోచనలు కూడా అరువు తెచ్చుకున్నట్లు ఉంటాయి’’ అని రాచమల్లు వ్యాఖ్యానించారు.
‘‘మన రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది.. ఈ మూడు పార్టీలకు విడిగా వైఎస్సార్సీపీనీ ఓడించే బలం ఉందా..?. వారికి సొంతగా గెలిచే బలం లేదు కాబట్టే మూడు పార్టీలు జత కట్టాయి. మీరు జెండాలు జత కడితే.. జగన్ జనంతో జతకట్టారు. మీరు మూడు పార్టీలు కలిసి ప్రజలకు ఏమైనా మేలు చేశారా...?. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. కేవలం చంద్రబాబు ఇచే ప్యాకేజీతో నోరు మూసుకున్నాడు. నువ్వు జగన్ చేతిలో రేఖలు తుడుపుతావా..?. ఓ పక్క టీడీపీ, మరో పక్క బీజేపీ లేకపోతే నీ మనుగడే లేదు. నువ్వు జగన్ను ఏమి చేయగలవు..?’’ అంటూ రాచమల్లు నిలదీశారు.
‘‘ఈ దేశంలో చంద్రబాబు అంత అవకాశవాది ఎవరూ లేరు. ఆయన జత కట్టని పార్టీ లేదు.. ఆయనకు కేవలం అధికార దాహం మాత్రమే ఉంది. బీజేపీ పెద్ద ముత్తయిదువు పాత్ర.. ఏమీ చేయలేదు కానీ పేరుకు ఉంటుంది. 2 శాతం, 30 శాతం ఓట్లు ఉన్న వీళ్లు 40 శాతం ఓట్లున్న జగన్ను ఏమీ చేయలేరు. అందుకే జగన్ ఓడిపోయాడు కానీ.. చావలేదు అని వాళ్లే అంటున్నారు. వీళ్లెవరికీ జగన్ను ఢీకొట్టే పరిస్థితి లేదని వాళ్లకే తెలుసు. మీ మేనిఫెస్టోను ఆనాడు బీజేపీ ముట్టుకోలేదు. కానీ జగన్ మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్నారు’’ అని రాచమల్లు గుర్తు చేశారు.
‘వీళ్ళంతా రాజకీయంగా అవిటి వాళ్ళు.. ఒకరి ఊతం లేనితే మరొకరు లేరు. ఈ రాష్ట్రంలో ఎవరూ చేయని సంక్షేమం ఒక్క వైఎస్ జగన్ మాత్రమే చేశాడు. జగన్ పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు. ఒక్కడు కాబట్టే.. సొంత ఆలోచనతో అనేక సంస్కరణలు చేపట్టాడు. జగన్ పొత్తుకు పోలేదంటే నైతిక విలువలు ఉన్నాయని అర్థం.. తన పాలనని నమ్ముకున్నాడు. ఓటమిని ఆహ్వానించాడు. కష్టాలను ఆహ్వానించాడు కానీ తలొగ్గలేదు. అలాంటి విలువలు కలిగిన జగన్ మా నాయకుడు అయినందుకు గర్వపడుతున్నా. నా శ్వాస ఆగిపోయేంత వరకు జగన్ తోనే నా ప్రయాణం
..2029 వస్తుందంటే మీ దడ పుడుతోంది..జనంలో జనం బలమెంతో మీకు తెలుసు. అందుకే మీరు గెలిచినా మీకు ఆదరణ లేదు.. జగన్ ఒడినా ఆదరణ ఉంది. జిల్లాల విభజనలో పరిపాలన సౌలభ్యం, ప్రజల అభిప్రాయం అవసరం. తమ ఓట్లకు, సీట్లకు అనుకూలంగా జిల్లాల విభజన చేయడం సరికాదు. ప్రభుత్వాలు మారగానే జిల్లాలు మారిస్తే ఇక హేతుబద్ధత ఎలా ఉంటుంది..?. మళ్ళీ జగన్ ప్రభుత్వం రాగానే అన్నమయ్య జిల్లా రాకుండా ఉంటుందా?. చివరికి అన్నమయ్య పేరుపై ఉన్న జిల్లాను కూడా ఇలా చేయడం సరికాదు’’ అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హితవు పలికారు.



