కోల్కతా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన విమర్శలతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. కోల్కతాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మమతా బెనర్జీ నేతృత్వంలోని గత 15 ఏళ్ల పాలనలో రాష్ట్రం అవినీతి, భయం, చొరబాట్లతో నిండిపోయిందని ఆరోపించారు. రాష్ట్ర భద్రతకు ఈ అంశాలు తీవ్ర ముప్పుగా పరిణమించాయని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బెంగాల్ భవిష్యత్తుకు అత్యంత కీలకమని అమిత్షా అన్నారు.
బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా జరుగుతున్న చొరబాట్లపై షా ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇది కేవలం రాష్ట్రానికే కాకుండా జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని అన్నారు. మమతా బెనర్జీ తన రాజకీయ ప్రయోజనాల కోసం చొరబాట్లను ప్రోత్సహిస్తున్నారని, సరిహద్దుల వద్ద కంచె వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని అమిత్ షా పేర్కొన్నారు. కేవలం దేశభక్తి గల బీజేపీ ప్రభుత్వం మాత్రమే సరిహద్దులను కాపాడి, చొరబాటుదారులను బయటకు తరిమికొడుతుందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇక్కడి ‘టోల్ సిండికేట్’,అవినీతి కారణంగా ప్రజలకు చేరడం లేదని అమిత్ షా మండిపడ్డారు. బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, భయం, దుర్పరిపాలన నుండి విముక్తి పొంది అభివృద్ధి దిశగా సాగాలని నిశ్చయించుకున్నారని అమిత్ షా అన్నారు. 2026, ఏప్రిల్లో జరగనున్న ఎన్నికల్లో ఓటర్లు తృణమూల్ ప్రభుత్వానికి చరమగీతం పాడనున్నారని ఆయన జోస్యం చెప్పారు.
వచ్చే ఏడాది ఏప్రిల్ 15 నాటికి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ తర్వాత బెంగాల్ కోల్పోయిన వైభవాన్ని పునరుద్ధరిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్ తదితర మహనీయులు కలలుగన్న బెంగాల్ను నిర్మిస్తామని, రాష్ట్ర సంస్కృతిని, పునరుజ్జీవనాన్ని కాపాడటానికి కృషి చేస్తామని అమిత్ షా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: డిజిటల్ హోరులో 'ప్రింట్' జోరు.. యూపీ ముందడుగు


