జిల్లా కలెక్టర్ విజయరామరాజు
పులివెందుల రూరల్: పులివెందుల మోడల్ టౌన్లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. శుక్రవారం ఆయన పాడా ఓఎస్డీ అనిల్కుమార్రెడ్డితో కలిసి పట్టణంలోని మెడికల్ కళాశాల, మండల మినీ సెక్రటేరియట్, సెంట్రల్ బోలే వార్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ దశలలో జరుగుతున్న పనులు వాటికి కేటాయించిన గడువులోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆర్అండ్బీ అతిథి గృహంలో సిటీ సెంట్రమ్, సెంట్రల్ బోలే వార్డు, మండల మినీ సెక్రటేరియట్లో జరుగుతున్న పనుల తీరుపై అధికారులతో వన్టు వన్ సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా పట్టణంలో పనులు చేపట్టాలన్నారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులను కోరారు. మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాణ్యతా ప్రమాణాలు పాటించండి
వేంపల్లె: అభివృద్ధి పనులకు సంబంధించి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు అధికారులను ఆదేశించారు. ఇడుపులపాయలో నూతనంగా నిర్మిస్తున్న వైఎస్సార్ మోమోరియల్ పార్కు పనులను పాడా ఓఎస్డీ అనిల్కుమార్రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెలాఖరులో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అంతలోపు పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ చక్రాయపేట మండల ఇన్చార్జి వైఎస్ కొండారెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.