యాదగిరిగుట్ట: యాదగిరి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మార్గంలో బీరు, మద్యం సీసాలు దర్శనమిస్తుండడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయాధికారులు, ఎస్పీఎఫ్ పర్యవేక్షణ లేకపోవడంతోనే గిరి మార్గం మందు బాబులకు అడ్డాగా మారుతోందని వారు అంటున్నారు. రాత్రి సమయంలో గిరి ప్రదక్షిణకు వెళ్లే మార్గంలోని యాదరుషి మండపం వద్ద, జనరేటర్ గది ముందు కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సేవించి అక్కడే సీసాలను వదిలి వెళ్తున్నారు. వేకువజామునే గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు మద్యం సీసాలు కనిపించడంతో వారి ఆధ్యాత్మిక చింతన దెబ్బ తింటోంది. ఆలయంతో పాటు గిరి ప్రదక్షిణ మార్గంలో నిత్యం నిఘా ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నా ఎస్పీఎఫ్ అఽధికారులు మాత్రం మందు బాబులను పట్టించుకోవడం లేదని భక్తులు అంటున్నారు. గతంలో గిరి ప్రదక్షిణ మార్గంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దీంతో అప్పట్లో పత్రికల్లో కథనాలు రావడంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కానీ సీసీ కెమెరాలకు కనెక్షన్ మాత్రం ఇవ్వలేదని అంటున్నారు. ఇప్పటికై నా ఆలయాధికారు, ఎస్పీఎఫ్ అధికారులు రాత్రి సమయంలో గిరి ప్రదక్షిణ మార్గంలో నిఘా ఏర్పాటు చేసి, గిరి ప్రదక్షిణ మార్గాన్ని అపవిత్రం కాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.


