మోత్కూరు: మోత్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రైవేట్లో అధిక ఫీజుల ఒత్తిడి కారణంగా వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు ఈ బడిలో చేరేందుకు వస్తున్నారు. గురువారం నాటికి అడ్మిషన్లు 161 కి చేరడంతో ఆ సంఖ్య ఆకారంలో విద్యార్థులను కూర్చోబెట్టారు. తమ పాఠశాలలో గత ఏడాది పదవ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించడంతో పాటు పది మంది డీఆర్డీఏ, ఒకరు ట్రిబుల్ ఐటీకి ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు దేవినేని అరవిందరాయుడు గురువారం విలేకరులకు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. తమ పాఠశాలలో విశాలమైన క్రీడా మైదానం, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు.


