భువనగిరిటౌన్ : ఇజ్రాయెల్లో కేర్ గివర్ ఉద్యోగాల భర్తీకి అభ్యర్థుల నుంచి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్కామ్) ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి పద్మ శుక్రవారం తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థుల వయోపరిమితి 25 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలని తెలిపారు. ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, డిప్లొమా ఇన్పేషెంట్ కేర్ పూర్తి చేసి, గుర్తింపు పొందిన భారతీయ సంస్థ నుంచి నర్సింగ్ డిప్లొమా లేదా శిక్షణ సర్టిఫికేట్ కలిగిన వారు అర్హులని వెల్లడించారు. ఎంపికై న వారికి నెలకు సుమారుగా రూ.1,86,000 జీతం లభిస్తుందని, ప్రారంభ ఒప్పంద కాలం రెండేళ్లు ఉంటుందని వివరించారు. దరఖాస్తులను tomcomglobal@gmail.com ఈమెయిల్ ఐడీకి పంపించాలని, మరిన్ని వివరాలకు టామ్కామ్, లేదా 0835524946 నంబర్ను సంప్రదించాలని కోరారు.
యాదగిరి క్షేత్రంలో ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి శుక్రవారం ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి తిరు, మాఢ వీధుల్లో సంప్రదాయంగా ఊరేగించారు. సేవకు ముందు మహిళలు మంగళ హారతులతో నీరాజనం పలికారు. అనంతరం అమ్మవారి సేవను అద్దాల మండపంలో అధిష్టించి, పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా పూజలు చేసి, హారతినిచ్చారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక ఆలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలు వంటి పూజలను విశేషంగా చేపట్టారు.
ముగిసిన తిరు
నక్షత్ర ఉత్సవాలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఈ నెల 12న ప్రారంభమైన ఆండాళ్ అమ్మవారి తిరు నక్షత్ర వేడుకలు శుక్రవారం రాత్రి ముగిశాయి. ఉదయం అమ్మవారికి విశేషంగా తిరుమంజన ఉత్సవం జరిపించారు. అనంతరం దివ్య ప్రబంధ పారాయణీకులచే ప్రబంధ పారాయణాన్ని పఠించారు. సాయంత్రం అమ్మవారికి పురవీధి సేవను నిర్వహించి, అద్దాల మండపంలో విశేష తిరువారాధన సేవాకాలం చేపట్టారు. అనంతరం తీర్థప్రసాద గోష్ఠి చేపట్టి ఉత్సవాలు ముగించారు.
సీఐటీయూ రాష్ట్ర కమిటీ సమావేశాలు వాయిదా
భువనగిరిటౌన్ : భువనగిరి కేంద్రంగా ఈ నెల 16, 17, 18వ తేదీల్లో జరగాల్సిన సీఐటీయూ రాష్ట్ర కమిటీ సమావేశాలు తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కార్యదర్శి కల్లూరి మల్లేశం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశాలను వచ్చే నెల 5, 6 తేదీల్లో యాదగిరిగుట్టలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. యూనియన్ నాయకులు, కార్యకర్తలు అనుబంధ సంఘాల ప్రతినిధులు గమనించాలని తెలిపారు.
తెరుచుకున్న
వంగపల్లి రైల్వేగేట్
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట–వంగపల్లి ప్రధాన రహదారిలో, వంగపల్లి గ్రామం వద్ద ఉన్న రైల్వే గేట్ను శుక్రవారం రైల్వేశాఖ అధికారులు తెరిచారు. భువనగిరి–వంగపల్లి గ్రామాల మధ్య గల లెవల్ క్రాసింగ్ 33టీ ఓవర్ పోలింగ్ మరమ్మతుల కారణంగా పది రోజులుగా అధికారులు , ఈ రైల్వేగేట్ను మూసివేశారు. పనులు పూర్తి కావడంతో తిరిగి తెరిచారు.


