ఆలేరు : కేంద్రంలోని మోదీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు. ఉత్తరాఖండ్లోని రాంలీల మైదానంలో జరిగిన ఘటనను నిరసిస్తూ ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గేకు సంఘీభావంగా శుక్రవారం ఆలేరులోని పార్టీ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఐలయ్య పాదయాత్ర నిర్వహించి, సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 80 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఇంకా అంటరానితనాన్ని ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆదివాసీలతోపాటు రైతులు, యువతను అణచివేస్తూ రాజ్యాంగ హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ముసుగులో కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతుందన్నారు. మోదీ సర్కారును గద్దె దించే వరకు విశ్రమించొద్దని పిలుపునిచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు జనగాం ఉపేందర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ బీజన బాలమణి, వైస్చైర్మన్ అంగిడి ఆంజనేయులు, వివిధ మండలాల నాయకులు, పలువురు కౌన్సిలర్లు, సర్పంచ్లు పాల్గొన్నారు.
ఫ డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య


