- IIIలో
సాక్షి, యాదాద్రి: ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలకు వైటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శుక్రవారం యాదగిరిగుట్టలో వైటీడీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన పాలకమండలి రెండవ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా 26 అంశాలపై పాలక మండలి సభ్యులు ఆమోదం తెలిపారు. అదనంగా మరో 5 అంశాలను టేబుల్ ఎజెండాగా చేర్చి ఆమోదించారు. ఈ అంశాలను చైర్మన్ సత్యనారాణరెడ్డి ప్రెసిడెన్షియల్ సూట్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. సమావేశంలో వైటీడీ బోర్డు సభ్యులు వినోద్, కె.సురేఖ, సీహెచ్ విజయరాజం, తూళ్ల విజయేందర్, గుండా మల్లయ్యగుప్త, ఈశ్వరమ్మ యాదవ్, రాఘవేందర్రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఈఓ భవాని శంకర్, ప్రధానార్చకులు వెంకటాచార్యులు పాల్గొన్నారు.
ఆమోదం తెలిపిన అంశాలు
● కొండపైన భక్తుల సౌకర్యార్థం పుష్కరిణి వద్ద రూ.43.12 కోట్ల అంచనా వ్యయంతో దీక్షాపరుల మండపం, చైర్మన్ సత్యనారాయణరెడ్డి సొంత నిధులతో బాలాలయం తొలగించిన చోట కొండపైన సుమారు 9.87కోట్ల అంచనా వ్యయంతో స్వామివారి నిత్య కల్యాణ మండపం నిర్మాణం. రాయిగిరి వద్ద ప్రస్తుతం ఉన్న స్వాగత తోరణం స్థానంలో రూ.3.16 కోట్లతో నిర్మాణం. యాదగిరిపల్లి గోశాలలో 40 ఎకరాల విస్తీర్ణంలో మోడల్ గోశాల, దేవస్థానం పరిసర ప్రాంతంలో వేదపాఠశాల, విశ్వవిద్యాలయం నిర్మాణం.
● రోజుకు 1,500 నుంచి 2,000 మంది భక్తులకు అన్నప్రసాదం అందించడం.
● టికెట్ బుకింగ్ ప్రక్రియను ఆధునీకరించి, ’పోర్టల్ ఐటీ నెట్వర్క్ సిస్టమ్’ ద్వారా ఆన్లైన్ టికెట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులోకి తేవడం.
● దేవస్థానంపై విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు దేవస్థాన భవన సముదాయాలపై పార్కింగ్ స్థలంలో నాలుగు మెగావాట్ల సోలార్ గ్రిడ్ ఏర్పాటు.
● ఆలయ సమీపంలోని 4, 5 ప్రధాన కూడళ్లలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ప్రధాన కూడళ్లలో రాతి విగ్రహాల ప్రతిష్ఠాపన.
● ఆలయ పరిధిలోనే ధర్మకర్త గుండా మల్లయ్యగుప్త సొంత ఖర్చు రూ.9 లక్షల అంచనా వ్యయంతో కల్యాణ కట్ట సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
● కొండపైన వేంచేపు మండపం పక్కన డోనార్ ఎమినిటీ సెంటర్, బస్టాండ్ ఉత్తర భాగంలో పిలిగ్రిమ్ ఎమినిటీ సెంటర్ ఏర్పాటు.
● కొండపైన విష్ణు పుష్కరిణి ప్రాంతాన్ని కోతుల నుంచి రక్షించేందుకు సోలార్ పెన్సింగ్ను ధర్మకర్త ఈశ్వరమ్మ యాదవ్ స్వంత ఖర్చుతో చేపడుతున్నారు.
● గిరి ప్రదక్షిణ ఏరియా, అనువైన నిర్మాణాలపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన చేయనున్నారు. గతంలో నిలిచిపోయిన మెట్ల మార్గం పనులను, ముందుకు వచ్చిన దాతల సహకారంతో త్వరలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నారు.
● ప్రముఖ వ్యక్తులు వ్యక్తిగతంగా ఆలయాన్ని సందర్శించినప్పుడు మాత్రమే ప్రొటోకాల్ దర్శనం చేయాలని తీర్మానించారు.
ఫ మరో 5 అంశాలను టేబుల్ ఎజెండాగా చేర్చి ఆమోదించిన పాలకమండలి


