ప్రస్తుతం కురిసిన తుపాన్ వర్షం పత్తి, కంది పంటలకు ఎంతో మేలు చేస్తుంది. వర్షాలు ఆలస్యమైనందున రైతులు ఆగస్టు 15 వరకు మంచి దిగుబడి ఇచ్చే కంది పంటను సాగు చేసుకోవచ్చు. ఆగస్టు 15 దాటిన తర్వాత జొన్న, పెసర పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంది. జిల్లాలో 7 వేల టన్నుల యూరియాను అందుబాటులో ఉంచాం.
– పి.వి. రమణారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి
సాక్షి, యాదాద్రి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న ముసురు వర్షాలు రైతాంగానికి కొంత ఊరటనిచ్చాయి. రెండు నెలలుగా సరైన వానలు లేక ఎండిపోతున్న పత్తి, కంది వంటి ఆరుతడి పంటలకు ఈ వర్షం ప్రాణంపోసింది. భువనగిరి, మోత్కూరు, ఆత్మకూరు (ఎం), బొమ్మలరామారం మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురవగా, మిగతా మండలాల్లో సగటున సెంటీమీటరు వరకు వర్షపాతం నమోదైంది. పంటలు చేతికి వస్తాయో లేదోనని నిరాశలో ఉన్న రైతుల్లో ఈ వానలు కొత్త ఆశలు రేకెత్తించాయి. ప్రస్తుతం వర్షం కురుస్తుండటంతో పత్తి చేన్లకు యూరియా అడుగుమందుగా వేసే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు.
ఒక్క రోజే అధిక వర్షం
జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఒక రోజులో 5.3 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఏకంగా 15.5 మి.మీ వర్షం కురిసింది. ఆత్మకూరు (ఎం) మండలంలో సాధారణ వర్షపాతం 4.6 మి.మీ కాగా, ఒక్కరోజే 29.3 మి.మీ నమోదైంది. భువనగిరి మండలంలో 36.8 మి.మీ వర్షపాతం రికార్డయింది.ఈ ఒక్క రోజు వర్షం కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ, వానాకాలం సీజన్ ప్రారంభం నుంచి లెక్కేస్తే లోటు వర్షపాతం భయపెడుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 42 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
16 మండలాల్లో లోటు వర్షపాతం
వానాకాలంలో సీజన్లో జూన్, జూలై నెలల్లో జిల్లాలోని 17 మండలాల్లో ఒక్క నారాయణపూర్ మండలంలో మాత్రమే సాధారణం కంటే 5 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు కాగా, మిగిలిన 16 మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం ఉంది. వీటిలో ప్రధానంగా బీబీనగర్, ఆలేరు, తుర్కపల్లి, గుండాల, భువనగిరిలో తీవ్రవర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం కురుస్తున్న ముసురుతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరలేదు. భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం లేదు. దీంతో వరి నాట్లు వేసిన రైతులు, నాట్లు వేయడానికి సిద్ధమవుతున్న వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
జూలైలో సగటు వర్షపాతం పరిస్థితి
సాధారణ వర్షపాతం 231.4 మి.మీ
నమోదైన వర్షపాతం 133.6 మి.మీ
మొత్తం లోటు 42 శాతం
ఫ తుపాను కారణంగా మంగళవారం
15.5 మి.మీ వర్షపాతం నమోదు
ఫ ఇంకా సరిగా తడవని మెట్ట భూమి
ఫ జిల్లాలో 42 శాతం లోటు వర్షపాతం
ఫ ఐదు మండలాల్లో తీవ్ర వర్షాభావం


