సాక్షి,యాదాద్రి : రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. శనివారం కలెక్టరేట్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీరాజ్ శాఖ వారిచే రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, వెంకారెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ.. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా ఆపదలో ఉన్న వారిని ప్రాణాలను రక్షించే అవకాశం ఉందన్నారు. రెడ్క్రాస్ రాష్ట్ర కార్యదర్శి, సీఈఓ ప్రొఫెసర్ శ్రీరాములు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో త్వరలోనే బ్లడ్ బ్యాంకు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర రెడ్ క్రాస్ రెండు కోట్ల మేర ఎక్విప్మెంట్ను సమకూర్చిందని, భవన నిర్మాణం కోసం దాత శ్రీధర్ రెడ్డి రూ.5కోట్ల మేర అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, సీఈఓ శోభారాణి, చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, అదనపు పీడీ సురేష్, డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్, పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి హరి శివప్రసాద్, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
– అదనపు కలెక్టర్ భాస్కర్రావు


