తిరుమలగిరి(సాగర్) : విద్యుత్ స్తంభం ఎక్కి తీగ లాగుతుండగా విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందాడు. ఈ ఘటన తిరుమలగిరి(సాగర్) మండలం చింతలపాలెం పరిధిలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపాలెం గ్రామానికి చెందిన యాల్ల మల రామకృష్ణ(42) గ్రామ పరిధిలోని నాగార్జునసాగర్ డ్యాం బ్యాక్వాటర్లో తన వ్యవసాయ మోటారును బిగించడానికి వెళ్లాడు. ఎల్టీ లైన్ బిగించడానికి విద్యుత్ స్తంభం ఎక్కి తీగ లాగుతుండగా అది గాలికి వేరే ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా అవుతున్న తీగపై పడడంతో రామకృష్ణ విద్యుదాఘాతానికి గురై స్తంభంపై నుంచి కిందపడిపోయాడు. పక్కనే పొలంలో పైపులు సరిచేస్తున్న రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చేసరికే రామకృష్ణ మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాగర్లోని కమలా నెహ్రూ హాస్పిటల్కు తరలించారు. మృతుడి భార్య అనసూర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వీరశేఖర్ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
డిండి : విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందాడు. ఈ ఘటన డిండి మండలం ఖానాపూర్ గ్రామంంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ గ్రామానికి చెందిన ముత్తాని అంతిరెడ్డి(53) వ్యవసాయ పొలంలోని బోరు మోటారుకు విద్యుత్ సప్లయ్ నిలిచిపోవడంతో సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి మరమ్మతులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ అంతిరెడ్డికి తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి భార్య వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. మృతుడికి ఒక కుమార్తె ఉంది.
ఎలక్ట్రీషియన్ మృతి..
నేరేడుచర్ల : విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతిచెందాడు. ఈ ఘటన నేరేడుచర్ల మండలం పెంచికల్దిన్నె గ్రామంలో మంగళవారం జరిగింది. ఎస్ఐ చల్లమల్ల గోపాల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పెంచికల్దిన్నె గ్రామానికి చెందిన రాచూరి శ్రీనివాస్(46) ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ రైతు తన వ్యవసాయ బావి వద్ద విద్యుత్ సమస్య ఉండటంతో మంగళవారం శ్రీనివాస్ను తీసుకెళ్లాడు. అక్కడ శ్రీనివాస్ విద్యుత్ వైర్లను చెక్ చేస్తుండగా.. విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే అతడిని హుజూర్నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


