యాదగిరిగుట్ట: వేసవిలో నిండు కుండలా ఉన్న చెరువు.. వర్షాకాలంలో అడుగంటిపోతోంది. యాద గిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ కొండ దిగువన ఉన్న గండి చెరువులో నీటి మట్టం తగ్గుతోంది. గోదావరి జలాలు నిలిచిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. భక్తుల అవసరాలకు నీరు అందుబాటులో ఉంచాలని, గార్డెన్స్కు, రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లకు నీరు అందించాలనే ఉద్దేశంతో వేసవిలో గండి చెరువును గోదావరి జలాలతో నింపారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నుంచి మే 1 వరకు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ల మీదుగా బస్వాపూర్లోని నరసింహ సాగర్ రిజర్వాయర్కు వచ్చే మెయిన్ కెనాల్ నుంచి నీటిని మళ్లించారు. జంగంపల్లి వద్ద ఉన్న ఓటీ–2 సబ్ కెనాల్ ద్వారా గండి చెరువులోకి 14 ఎంసీఎఫ్టీల (మిలియన్ క్యూబిక్ ఫీట్) నీటిని పంపింగ్ చేయడంతో కళకళలాడింది. ప్రస్తుతం గోదావరి జలాల సరఫరా నిలిచిపోయింది.


