ఆత్మకూర్ (ఎస్) : మండల వ్యాప్తంగా కరెంటు కష్టాలు మొదలయ్యాయి. భూగర్భ జలాలు తగ్గడంతో పాటు ఎస్సారెస్పీ కాలువ నీరు సరిగ్గా రాకపోవడం పంటలను ఎండుముఖం పట్టేలా చేసింది. పంట చేతికి వచ్చే సమయంలో భూగర్భ జలాలు తగ్గడం, కరెంటు కష్టాలతో పంటను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మకూర్లోని ఏనుబాముల రోడ్డులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో పంటను కాపాడునేందుకు రైతు జనరేటర్ సాయంతో పంటకు నీళ్లు పెడుతున్నాడు. మరికొన్ని చోట్ల గత్యంతరం లేక పండించిన వరిని పశువులకు మేతగా వదిలేస్తున్నారు. ఆత్మకూర్.ఎస్ మండలంలో సుమారు 10వేల ఎకరాల పంట ఎండిపోయే ప్రమాదంలో ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ట్యాంకర్లతో నీరు
మునుగోడు : వరి పంట చేతికి వచ్చే సమయంలో నీరు అందకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. యాసంగి సీజన్ ఆరంభంలో పుష్కలంగా నీరు పోసిన బోర్లు.. ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయంలో భూగర్భ జలాలు పడిపోవడంతో నీరు అడుగంటింది. పంట పొలాలు ఎండిపోతున్నాయి. పంటను కాపాడుకోవడానికి వేల రూపాయలు ఖర్చుచేసి ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించి పొలాలకు పెట్టే పరిస్థితి ఎదురవుతోంది. మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో రైతులకు కోలుకోలేని దెబ్బగా మారింది. గ్రామంలో దాదాపు 50 మందికిపైగా రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి వరి పొలాలకు అందిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ నీటికి రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు ఖర్చు చేస్తున్నారు. అయినా రైతులకు సరిపడా ట్యాంకర్లు దొరకకపోవడంతో ఇతర గ్రామాల నుంచి తీసుకొస్తున్నారు. నిత్యం పదికి పైగా ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు.
ఫ పంటను కాపాడుకునేందుకు
రైతుల అష్టకష్టాలు
ఫ ట్యాంకర్లతో నీటి సరఫరా
ఫ కరెంటు కష్టాలు కూడా తోడవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు


