భూదాన్పోచంపల్లి : ఇక్కత్ చేనేత వస్త్రాల తయారీ విధానాలు, కులవృత్తుల జీవన స్థితిగతులను తెలుసుకొనేందుకు శనివారం ఇద్దరు అమెరికన్లు పోచంపల్లిని సందర్శించారు. చేనేత గృహాలకు వెళ్లి మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలు, నాణ్యత, డిజైన్లు, మార్కెటింగ్ విధానాలు, ఉపాధి అవకాశాలను కార్మికులను నేరుగా తెలుసుకున్నారు. చేనేత డిజైన్లు చూసి కార్మికుల కళా నైపుణ్యాలను అభినందించారు. అనంతరం టూరిజం పార్కును సందర్శించారు. పోచంపల్లి చేనేత పరిశ్రమ, భూదా నోద్యమ చారిత్రక నేపథ్యాన్ని స్థానిక చేనేత కార్మికురాలు నవనీత వారికి వివరించారు.
హోటళ్లు, దుకాణాలపై ‘సివిల్ సప్లయ్’ దాడులు
మోత్కూరు : మోత్కూరు పట్టణంలో డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్గా వినియోగిస్తున్న హోటళ్లు, ఇతర దుకాణాలపై శనివారం సివిల్ సప్లయ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎనిమిది డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకొని బాధ్యులపై కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో సివిల్ సప్లయ్ ఏఎస్ఓ సురేందర్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ నర్సింగరావు, గిర్దావర్ నర్సింహారెడ్డి, భారత్ గ్యాస్ గోదాం ఇన్చార్జి చిప్పలపల్లి యాదగిరి తదితరులు ఉన్నారు.
యాదగిరి క్షేత్రంలోవిశేష పూజలు
యాదగిరిగుట్ట : శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం విశేష పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన పూజలను జరిపించారు. ఇక ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలను నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో ముందుగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం ఆలయ ఆచార వ్యవహారాలతో చేపట్టారు. సాయంత్రం వేళ భక్తుల నడుమ జోడు సేవలను మంగళ వాయిద్యాల మధ్య ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
కేసుల రాజీకి పోలీసులు సహకరించాలి
చౌటుప్పల్ : కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను రాజీ చేసేందుకు పోలీసులు కక్షిదారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవీలత అన్నారు. శనివారం చౌటుప్పల్లోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా సివిల్, ట్రాఫిక్, ఎకై ్సజ్ విభాగాల పోలీసు అధికారులతో లోక్ అదాలత్పై నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 28న నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్లో పెండింగ్ ఉన్న కేసులన్నీ పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. కేసుల పరిష్కారం కోసం పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి, కక్షిదారులు రాజీ పడేలా వారిని ప్రోత్సహించాలన్నారు. కోర్టు పరిధిలోని ప్రతి మారుమూల గ్రామంలోనూ లోక్ అదాలత్ ప్రాధాన్యత గురించి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ పటోళ్ల మధుసూదన్రెడ్డి, సీఐ మన్మథకుమార్, రూరల్ సీఐ రాములు, ఎకై ్సజ్ సీఐ బాలోజీనాయక్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


