ప్రశాంతంగా పరీక్షలు రాయాలి
సాక్షి, యాదాద్రి : పదో తరగతి పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా ఈ సారి అనుమతిస్తారు. ఐదు నిమిషాలు దాటితే పరీక్ష రాయడానికి అనుమతించరు. జిల్లా వ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. విద్యార్థులు ఉదయం 9గంటల లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. స్మార్ట్ ఫోన్లు ఎలక్ట్రానికి పరికరాలను అనుమతించరు. మొత్తం 8,913 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 16 వరకు జరుగుతాయి.
కేంద్రాల వద్ద 163 సెక్షన్
పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అలజడి జరుగకుండా బీఎన్ఎస్ 163 సెక్షన్ విధించారు. సీసీ కెమెరాల నిఘాలో కేంద్రాలు ఉంటాయి. పరీక్షా సమయంలో అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు.
ప్రతి కేంద్రానికి ఒక సూపరింటెండెంట్
ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక సూపరింటెండెంట్ చొప్పున మొత్తం 50 మంది సూపరింటెండెంట్లు, 50 మంది డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. 572 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా అడిషనల్ షీట్స్ కాకుండా 24 పేజీలు, 12 పేజీలతో కూడిన బుక్లెట్స్ను విద్యార్థులకు ఇస్తారు.
సౌకర్యాలు ఇలా..
ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థుల కోసం ఓఆర్ఎస్ ద్రావణం ఇతర అనారోగ్య కారణాలకు చికిత్స దించడానికి ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఏఎన్ఎంలను నియమించారు. కేంద్రాల్లో విద్యుత్, ఫర్నిచర్, చల్లని నీరు, మరుగుదొడ్లు వసతులు ఏర్పాటు చేశారు. ఏదైనా ఇబ్బందులు తలెత్తితే వాటి పరిష్కారానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సౌకర్యార్థం 9010772080ను టోల్ప్రీ నంబర్ను అధికారులు అందుబాటులో ఉంచారు.
విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాతంగా పరీక్షలు రాయాలి. గతేడాది కంటే ఈసారి మెరుగైన ఫలితాల సాధనకు పదో తరగతి విద్యార్థుల కోసం ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహించాం. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సైకిళ్లు అందజేస్తాం.
–కె.సత్యనారాయణ,
జిల్లా విద్యా శాఖ అధికారి
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
ఫ పరీక్షలు రాయనున్న 8,913 మంది విద్యార్థులు
ఫ ఫిర్యాదుల పరిష్కారానికి టోల్ప్రీ నంబర్ 9010772080 ఏర్పాటు


