ఇబ్బందులు పడుతున్నాం
2024–25 సంవత్సరానికే నిధులు
భూదాన్పోచంపల్లి : కేంద్ర ప్రభుత్వం ఇటీవల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. అయితే వీటి నుంచే తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలోని 427 గ్రామ పంచాయతీల సర్పంచ్ల పదవీకాలం 2024 జనవరి నెలాఖరుతో ముగిసింది. అప్పటి నుంచి తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల వరకు పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేకాధికారులుగా పంచాయతీల్లో పాలన కొనసాగింది. ఈ క్రమంలో పంచాయతీల నిర్వహణ, అభివృద్ధి, ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు సంబంధించి చాలా పనులు పూర్తిచేసేందుకు తన సొంత డబ్బులను ఖర్చు చేశారు. ప్రభుత్వం బిల్లులు విడుదల చేశాక తీసుకుందామంటే సకాలంలో రాక నానా ఇబ్బందులు పడుతూ వచ్చారు.
2024–25లో రూ.7.60 కోట్లు ఖర్చు
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 390 మంది పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు 2024–25 ఆర్థిక సంవత్సరంలో ట్రాక్టర్ల నిర్వహణ, పారిశుద్ధ్యం, వీద్యుద్ధీపాలు, పైప్లైన్ మరమ్మతులు, ఇతర పనులకు సుమారు రూ.7.60 కోట్ల మేర ఖర్చు చేశారు. కాగా ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.7,59,29,667లను విడుదల చేసింది. దాంతో విడుదలైన నిధుల నుంచే బకాయిలను సర్దుబాటు చేయాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు. ఇదిలా ఉంటే తాజా మాజీ సర్పంచులు సైతం తమ కూడా బకాయిలు రావాలని తాజాగా గ్రామ పంచాయతీల్లో జమ అయిన నిధుల నుంచి చెల్లించాలని అధికారులకు వినతిపత్రాలను అందజేస్తున్నారు. అయితే ప్రస్తుతం విడుదలైన నిధులు ఇటు కార్యదర్శులు, అటు మాజీ సర్పంచులు తమకంటూ తమకే ఇవ్వాలని పట్టుబట్టుతున్నారు. చివరికి ఉన్నతాధికారులు ఎవరికి ఎలా సర్దుబాటు చేస్తారో వేచిచూడాల్సిందే.
నిబంధనలు ఇవీ..
కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను టైడ్, అన్టైడ్ పేరిట విడుదల చేస్తుంది. టైడ్ నిధులను తాగునీరు, పైప్లైన్ మరమ్మతులు, క్లోరినేషన్, బోరు మోటార్ల నిర్వహణ, పారిశుద్ధ్యం పనులకు వినియోగించాల్సి ఉంటుంది. అన్టైడ్ నిధులను పంచాయతీ అభివృద్ధి పనులకు ఉపయోగించుకోవాలి.
జిల్లా వ్యాప్తంగా ఒక్కో పంచాయతీ కార్యదర్శి గరిష్టంగా రూ.3 లక్షల మేర సొంతంగా చేతి నుంచి గ్రామాభిృద్ధికి ఖర్చు చేశారు. బిల్లులు సకాలంలో రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాకు వచ్చిన 15వ ఆర్థిక సంఘం నుంచి తమ బకాయిలు చెల్లించాలని ఇటీవల డీపీఓను కలిసి విన్నవించాం.
– నరేందర్, పంచాయతీ కార్యదర్శుల
సంఘం జిల్లా అధ్యక్షుడు
జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్యం, తాగునీరు, పైప్లైన్ మరమ్మతులు తదితర పనులకు చేసిన ఖర్చులకు మాత్రమే చెల్లింపులు చేస్తాం. మొదటి ప్రాధాన్యతగా పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించాలి. మిగిలిన బడ్జెట్తోపాటు వచ్చే విడతలో మంజూరయ్యే నిధుల నుంచి బకాయిలు తీసుకొనేందుకు ఉత్తర్వులు ఇస్తాం.
– విష్ణువర్ధన్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి
ఫ ఉన్నతాధికారులకు పంచాయతీ కార్యదర్శుల విన్నపం
ఫ గ్రామాల అభివృద్ధికి రూ.7.60 కోట్ల మేర సొంత డబ్బులు ఖర్చు
ఫ బిల్లులు అందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన


