నూజివీడు : మండలంలోని యనమదల మండల పరిషత్ ఫౌండేషన్ పాఠశాలలో ఒకే ఒక్క విద్యార్థికి ఒక ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్నారు. గ్రామంలో 150కి పైగా కుటుంబాలు ఉన్నప్పటికీ, రెండో తరగతి వరకు మాత్రమే ఉన్న ఈ స్కూలుకు కేవలం ఒక్క విద్యార్థే వస్తున్నాడు. కాగా అర కిలోమీటరు దూరంలోని యనమదల హైస్కూల్ ఆవరణలోనే శాటిలైట్ స్కూల్ కూడా ఉంది. ఈ విద్యార్థిని అక్కడికి పంపి, ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడిని అవసరమైన మరో పాఠశాలకు డిప్యూటేషన్ వేసే వెసులుబాటు ఉంది. అయితే విద్యాశాఖ అధికారులు మాత్రం ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
ద్వారకాతిరుమల: స్థానిక పోలీస్స్టేషన్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. రామన్నపాలెం నుంచి తాడేపల్లిగూడెం వెళ్తున్న ఓ ట్రాక్టర్ నియంత్రణ తప్పి దుకాణం మెట్లపైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ తాపీ పని చేస్తున్న దొరసానిపాడుకు చెందిన సోమయ్యను ఢీకొట్టడంతో అతడు గాయపడ్డాడు. బాధితుడిని స్థానికులు హుటాహుటీన పీహెచ్సీకి తరలించారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ప్రమాద సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
ఉండి: జాతీయ రహదారి 165పై ప్రయాణిస్తూ ఉండి రైల్వే గేటు దాటే ప్రయాణికులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని రైల్వే శాఖ అధికారులు గేటు వద్ద ఒక హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ఉండి వద్ద ఆర్వోబీ ఫ్లైఓవర్ పనులు జరుగుతుండటంతో ట్రాక్పై భాగంలో విద్యుత్ లైన్ల ఎత్తు కంటే హైట్ గేజ్ ఎత్తును 40 సెంటీమీటర్లు కిందికి దించారు. ఈ కారణంగా గేటు దాటే లారీలు, టిప్పర్లు వంటి అన్ని రకాల సరుకు రవాణా భారీ వాహనాల ఎత్తు 13 అడుగులకు మించకూడదని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి 13 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న వాహనాలను తోలితే తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనని, అటువంటి వారిపై రైల్వే చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానా లేదా జైలు శిక్ష తప్పదని అధికారులు హెచ్చరించారు.


