కాళ్ల: ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంఘటన కాళ్ల మండలం ఎస్సీ బోస్ కాలనీలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం కాలనీకి చెందిన దంతులూరి సరోజినీ (70) ఒంటరిగా నివాసముంటుంది. బుధవారం ఉదయం పాలు పోసే వ్యక్తి వచ్చి పిలవగా స్పందన లేదు. స్థానికులతో కలిసి తలుపులు తెరచి చూడగా సరోజినీ విగతజీవిగా పడి ఉంది. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆదేశాల మేరకు ఆకివీడు రూరల్ సీఐ కాళీచరణ్, ఎస్సై గణేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ పలు ఆధారాలు సేకరించింది. మృతురాలి చెవులకు ఉన్న ఆభరణాలు కనిపించకపోవడం, బీరువా తాళాలు కనిపించకపోవడంతో, బీరువాలో ఉండాల్సిన సుమారు 11 కాసుల బంగారం చోరీకి గురైనట్లు బంధువులు ఆరోపించారు. ఈ నెల 4న కంటి ఆపరేషన్ చేయించుకుని వస్తుండగా కూడా ఇంట్లోని పది పట్టు చీరలు, కాసు బంగారం చోరీకి గురయ్యాయని, అయితే ఆ సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. బంధువులు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఐస్ బాక్స్లో ఉంచడం, బీరువాను తెరిచి చూడటంతో దర్యాప్తునకు కొంత అడ్డంకిగా మారింది. మృతురాలి సోదరుడు మంతెన సత్యనారాయణరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
బంగారం చోరీ?


