ఏలూరు (ఆర్ఆర్పేట): క్రికెట్ క్రీడలో ప్రస్తుత రోజుల్లో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయని రిటైర్డ్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. స్థానిక ఎస్వీసీ సినిమా ప్రాంగణంలో సోమవారం భీమవరం బ్లాస్టర్స్ ఫ్రాంచైజీ ఆధ్వర్యంలో ’ఆంధ్రా టెన్నిస్బాల్ ప్రీమియర్ లీగ్’ ట్రోఫీ టూర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. క్రీడలు కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా, మానసిక దృఢత్వానికి, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడానికి చక్కటి వేదికగా ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఫ్రాంచైజీ యజమానులు అబ్బూరి అనిల్, జి. గౌతమ్ మాట్లాడుతూ.. ఆంధ్రా టెన్నిస్బాల్ ప్రీమియర్ లీగ్ కోసం రాష్ట్రంలోని ఒంగోలు, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం వేదికలుగా ప్రాథమికంగా 670 మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరిలో ’గ్రీన్ వికెట్’ పేరుతో మరోసారి వడపోత ఎంపికలు నిర్వహించి, 8 ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొని మొత్తం 180 మంది క్రీడాకారులను కొనుగోలు చేశాయని వెల్లడించారు. ఏటీబీపీఎల్ ఆపరేషన్స్ హెడ్ ఐ.కొండలరావు మాట్లాడుతూ.. వచ్చే సెప్టెంబర్ 18 నుంచి 28వ తేదీ వరకు మంగళగిరిలోని డాక్టర్స్ స్పోర్ట్స్ అకాడమీ క్రీడా ప్రాంగణంలో ఈ పోటీలు ఘనంగా జరుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా ఏటీబీపీఎల్ ట్రోఫీని అతిథులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ట్రాఫిక్ సీఐ లక్ష్మణరావు, సాయి స్వర్ణ హీరో షోరూమ్ జనరల్ మేనేజర్ ఏవీ సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


