ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారం చేసే నాటికి పంచాయతీల్లో సెక్రటరీ, బిల్ కలెక్టర్, అటెండర్ మాత్రమే ఉండేవారు. పనుల నిమిత్తం ప్రజలు వ్యయప్రయాసల కోర్చి మండల కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. వారి వెతలకు తెరదించుతూ సచివాలయ వ్యవస్థను తెచ్చారు. జిల్లాలో 535 సచివాలయాలను ఏర్పాటుచేశారు. గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శి, ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఏఎన్ఎం, వెల్ఫేర్ అసిస్టెంట్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్, అగ్రికల్చర్ అసిస్టెంట్, పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్, ఉద్యాన అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్ తదితర పోస్టులను నియమించించి 35 ప్రభుత్వ శాఖలకు చెందిన 500లకు పైగా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. జిల్లాలో ఐదు వేలకు పైగా నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. రూ.141.2 కోట్లతో 353 సచివాలయాలకు సొంత భవనాల కోసం పనులు చేపట్టారు. జగనన్న సురక్ష శిబిరాల ద్వారా ఏ సర్వీస్ చార్జీ లేకుండానే 6,05,780 మందికి కుల ధ్రువీకరణ, ఆదాయ, జనన, మరణ, మ్యారేజ్ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ తదితర సర్టిఫికెట్లు అందజేశారు.
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆధునిక వసతులతో హెల్త్ క్లినిక్ల నిర్మాణం చేసింది. వైద్యుని గది, ల్యాబ్, స్థానికంగా వైద్య సిబ్బంది నివాసం ఉండేందుకు, ఇతర వసతులతో వీటి నిర్మాణం చేసింది. రూ.53.5 కోట్లతో 214 భవనాలకు పనులు చేపట్టి 96 భవనాలను వినియోగంలోకి తెచ్చింది. జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం కింద స్పెషలిస్ట్ వైద్యులతో విలేజ్ క్లినిక్లు, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్యశిబిరాలు నిర్వహించేవారు. 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచి 15 లక్షల మందికి పైగా రోగులకు వైద్యసేవలందించారు. ఆరోగ్యశ్రీలో రూ.5 లక్షల వరకు ఉన్న వ్యయ పరిమితిని రూ.25 లక్షలకు, 1,059గా ఉన్న చికిత్సల సంఖ్యను 3,257కు పెంచారు.
535 సచివాలయాలు..5 వేలకు పైగా ఉద్యోగాలు


