● కూటమి ప్రభుత్వంలో మహిళలపై దాడులకు నిరసనగా భారీ ర్యాలీ
● వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్యర్యంలో నిరసన గళం
భీమవరం: కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలు, హత్యలను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భీమవరంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్సీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి నేతృత్వంలో మంగళవారం జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ నిరసనలో పాల్గొన్నారు. ఇటీవల మహిళలు, బాలికలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయని, నిందితులకు కూటమి నాయకులు అండగా నిలుస్తున్నారని ఆరోపిస్తూ చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పట్టణంలోని ప్రకాశం చౌక్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు నిర్వహించిన ఈ భారీ ర్యాలీని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని నాయకులు నచ్చజెప్పి ముందుకు సాగారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని, దీనివల్ల మహిళలకు రక్షణ కరువైందని ధ్వజమెత్తారు. గుంటూరు, బద్వేలు వంటి చోట్ల మహిళలపై జరిగిన అమానవీయ ఘటనలే ప్రభుత్వ అసమర్థ పాలనకు అద్దం పడుతున్నాయని విమర్శించారు. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు కేసుల నమోదులో జాప్యం చేయడం, నిందితులపై చర్యలు తీసుకోకపోవడం వల్ల బాధితులకు న్యాయం జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా భద్రత కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థలు, హెల్ప్లైన్లు సమర్థవంతంగా పనిచేసేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.


