తాడేపల్లిగూడెం: ఎల్నినో వల్ల ఎదురవుతున్న వాతావరణ సవాళ్లను శాసీ్త్రయంగా అర్థం చేసుకొని, ఉద్యాన పంటలను కాపాడుకోవడానికి పక్కా కార్యాచరణ రూపొందించుకోవాలని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్లోని ఉద్యాన పంటలపై ఎల్నినో ప్రభావం అనే అంశంపై మంగళవారం ఒక రోజు రాష్ట్రస్థాయి వర్క్షాప్ వర్సిటీ వీసీ ధనుంజయరావు ఆధ్వర్యంలో జరిగింది. ఆయన మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావం వల్ల తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత వంటి పరిస్థితులు ఏర్పడి పంటలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందన్నారు. దీనిని అధిగమించడానికి సూక్ష్మ సేద్యం, మల్చింగ్, వర్షపు నీటి సంరక్షణ, డిజిటల్ వ్యవసాయం, కృత్రిమ మేధస్సు ఆధారిత శాసీ్త్రయ పద్ధతులను రైతులు విస్తృతంగా అవలంబించేలా అవగాహన కల్పించాలన్నారు. మామిడి, నిమ్మ, పామాయిల్, అరటి, బొప్పాయి, ఉల్లి, మిరప వంటి పంటలపై ఈ ప్రభావం భిన్నంగా ఉంటుందని, కాబట్టి పంటలవారీగా శాసీ్త్రయ యాజమాన్య సూచనలను రైతులకు అందించాలని ఉద్యాన శాఖ డైరెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు కోరారు. ముఖ్యంగా తక్కువ వర్షపాతం నమోదైన రాయలసీమ ప్రాంతంలో నీటి సంరక్షణ పద్ధతులు పాటించాలని, వరి సాగుకు బదులుగా తక్కువ నీరు అవసరమయ్యే పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని నిపుణులు సూచించారు. అలాగే ఎల్నినో ప్రభావం పశుసంపదపై కూడా పడుతుందని, పాడి పశువులకు తగిన తాగునీరు, పచ్చిమేత, నీడ కల్పించడంతో పాటు సకాలంలో పశువైద్య సేవలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఎల్నినో పరిస్థితుల్లో ఉద్యాన పంటల యాజమాన్యంపై తెలుగులో ముద్రించిన అవగాహన కరపత్రాలను అతిథులు ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ఎక్స్అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ సమూన్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి పీవీ సత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ జేవీ.రమణ, సీఆర్ఐడీఏ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కేవీ రావు, అటారీ డైరెక్టర్ ఎన్.మీరా, ఐసీఏఆర్ ఐఐఓపీఆర్ డైరెక్టర్ కె.సురేష్ మాట్లాడారు.


