తాడేపల్లిగూడెం అర్బన్: పాత గొడవల నేపథ్యంలో బావను బావమరిది బీరు సీసాను పగులగొట్టి పొడిచిన సంఘటన తాడేపల్లిగూడెంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం పట్టణంలోని యాగర్లపల్లి ప్రాంతానికి చెందిన యరసాని వెంకట్రావు, గెరకా సూరయ్య బంధుత్వ రీత్యా బావ, బావమరుదులు. సోమవారం రాత్రి వీరిద్దరూ మద్యం సేవిస్తూ పాతగొడవలపై ఘర్షణ పడ్డారు. ఇంతలో గెరకా సూరయ్య తన చేతిలో ఉన్న బీరు బాటిల్ పగులగొట్టి బావ వెంకట్రావుపై దాడి చేశాడు. దీంతో వెంకట్రావుకు చాతిపైన, తల, మెడ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అంందుకున్న పట్టణ పోలీసులు వెంకట్రావును స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందజేశారు. పట్టణ ఎస్సై బాదం శ్రీనివాస్ హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్యాయత్న సంఘటన సంభవించిందని స్థానికుల సమాచారం.


