కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఆత్మకూరు: మోడల్ సోలార్ విలేజ్ అయిన ఆత్మకూరు మండలకేంద్రంలో సోలార్ యూనిట్ల ఏర్పాటును వేగవంతం చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. మండలకేంద్రంలోని లబ్ధిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్లను గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో మిగిలిన ఇళ్లపై సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన మెటీరియల్ సమీకరించి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలన్నారు.
పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ...
అనంతరం స్థానిక పీహెచ్సీని తనిఖీ చేశారు. ఓపీ విభాగం, ఫార్మసీ, ల్యాబ్, ప్రసూతి గది, ఆపరేషన్ థియేటర్ను పరిశీలించారు. వివిధ రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బంది అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలన్నారు.
విద్యార్థులతో మమేకమైన కలెక్టర్...
అదేవిధంగా స్థానిక జెడ్పీహైస్కూల్ను సందర్శించారు. పాఠశాలలో విద్యార్థుల నమోదు, ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించారు. ఏడో తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. ఏ పాఠ్యాంశం చదువుతున్నారని తెలుసుకొని ‘హూ ఈజ్ సీవీ రామన్’ అని అడగగా విద్యార్థులు తడబడకుండా గ్రేట్ సైంటిస్ట్ అని ఇంగ్లిష్లో సమాధానం ఇవ్వగా కలెక్టర్ అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్ మహేశ్వరి, టీజీ రెడ్కో ఫీల్డ్ అధికారులు దీపక్, నవీన్కుమార్ యాదవ్, తహసీల్దార్ జగన్మోహన్రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి, ఎంఈఓ విజయ్కుమార్, మండల వైద్యాధికారిణి డాక్టర్ స్పందన, విద్యుత్ అధికారులు భరత్కుమార్, రాహుల్, హైస్కూల్ హెచ్ఎం నిర్మలకుమారి పాల్గొన్నారు.
హన్మకొండ అర్బన్: భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. జిల్లా ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో సమాచారం అందించేందుకు 1800 425 1115 టోల్ఫ్రీ నంబర్తో పాటు కలెక్టరేట్లో 24 గంటల కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ.ఆనంద్ కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో రానున్న ఐదు రోజులపాటు భారీ వర్షాల అవకాశం ఉన్నందున ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని డీజీపీ సీవీ.ఆనంద్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రవి, సీపీఓ సత్యనారాయణ రెడ్డి, సూపరింటెండెంట్ నాగరాజు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ చాహత్బాజ్పాయ్


