వనపర్తిటౌన్: గిరిజనుల ఆత్మగౌరవం, సంస్కృతి సంప్రదాయాలను కాపాడటంతో పాటు అన్నిరంగాల్లో వారిని ముందంజలో నిలుపడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని మార్కెట్యార్డులో జిల్లా బంజారా సేవాసంఘం నిర్వహించిన తీజ్ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై గిరిజన ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గిరిజన యువతులు తీజ్ మొలకలను ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తీజ్ వేడుకలు బంజారా సమాజ ఐక్యతకు, భక్తిశ్రద్ధలకు ప్రతీక అని కొనియాడారు. పాడిపంటలు బాగా పండాలని, కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మహిళలు, యువతులు పూజలు చేయడం వారి గొప్ప సంస్కృతిని తెలియజేస్తుందన్నారు. తరతరాల ఆచారాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ స్ఫూర్తితో ప్రభుత్వం ప్రతి తండాలో సేవాలాల్ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుడుతోందన్నారు. రూ.200 కోట్లతో సేవాలాల్ మహరాజ్ స్మృతివనం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడం గిరిజనుల సంక్షేమంపై ఉన్న నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. జిల్లాకేంద్రంలో సేవాలాల్ మహరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బంజారా సేవా సంఘం సభ్యులు కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో బంజారా సేవాసంఘం బాధ్యులు, గిరిజన పెద్దలు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.


