వనపర్తి: ఎస్ఐఆర్–2026 కార్యక్రమంలో భాగంగా గురువారం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 10 నుంచి గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించనున్నట్లు ఈఆర్వో, రెవెన్యూ డివిజనల్ అధికారి సుబ్రమణ్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ, వార్డుసభల్లో బీఎల్వోలు ముసాయిదా ఓటరు జాబితాలోని పేర్లను బహిరంగంగా చదివి వినిపిస్తారని.. జాబితాలో పేరు లేకపోయినా అర్హులైన భారతీయ పౌరులను గుర్తించి నమోదుకు అవసరమైన చర్యలు చేపడతారన్నారు. 2026, అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకునే భారతీయ పౌరులు తమ పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చుకునేందుకు అవసరమైన ధ్రువపత్రాలతో పాటు ఫారమ్–6 సమర్పించవచ్చని తెలిపారు. జాబితాలో నమోదైన వివరాల్లో తప్పులు లేదా మార్పులు అవసరమైతే ఫారమ్–8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అలాగే ఓటర్ల జాబితాలో అర్హత లేని వ్యక్తుల పేర్లు ఉన్నట్లయితే, అదే నియోజకవర్గానికి చెందిన ఓటరు ఫారమ్–7 ద్వారా అభ్యంతరం నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానం, ఎన్నికల సంఘం మార్గదర్శకాలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచి ంచారు. సంబంధిత గ్రామాలు, వార్డులకు చెందిన ఓటర్లు అధికసంఖ్యలో హాజరై ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించి తమ సందేహాలు, అభ్యంతరాలు, సూచనలను తెలియజేయాలని పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులతో పాటు అన్నివర్గాల ప్రజలు సమావేశాల్లో పాల్గొనాలన్నారు.


