వనపర్తి: జిల్లాలో పాముకాటు కారణంగా ఎలాంటి మరణాలు సంభవించకుండా వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదర్శ్సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాముకాటు కేసులు, గర్భిణుల ఆరోగ్య పరిస్థితులు, హిమోగ్లోబిన్ పరీక్షల నిర్వహణపై వైద్యాధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాముకాటు బాధితులకు పీహెచ్సీ స్థాయిలోనే యాంటీ స్నేక్ వెనం అందించి, అవసరమైన ప్రాథమిక చికిత్సను వెంటనే ప్రారంభించాలన్నారు. భవిష్యత్లో జిల్లాలో పాముకాటు కారణంగా ఒక్క మరణం కూడా సంభవించకూడదనే లక్ష్యంతో వైద్య సిబ్బంది పనిచేయాలన్నారు.
హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించాలి
ప్రతి పీహెచ్సీలో గర్భిణులకు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన యంత్రాలు, పరికరాలు పనిచేసే స్థితిలో ఉండేలా వైద్యాధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఏ పీహెచ్సీకై నా అదనపు సదుపాయాలు లేదా పరికరాలు అవసరమైతే వాటిని సమకూర్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. నవంబర్ 1 నాటికి జిల్లాలోని ప్రతి గర్భిణికి హిమోగ్లోబిన్ పరీక్ష పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భాస్కర్ నాయక్, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.


