వనపర్తి రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేఖ విధానాలు అవలంబిస్తూ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆరోపించారు. గురువారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యవక్తగా హాజరై మాట్లాడారు. మోదీ, అమిత్షా అనుకుంటే ఎదురులేదని ప్రచారం జరుగుతున్న సమయంలో దేశ యువత పెద్దఎత్తున మోదీ విధానాలను వ్యతిరేకించి సీజేపీ రూపంలో పోరాటం చేపట్టిందన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా, రాజ్యాంగ పరిరక్షణకు యువత, మహిళలు పెద్దఎత్తున పోరాడి విజయం సాధించారని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం దేశ సంపదను అంబాని, అదాని వంటి బడా పెట్టుబడిదారులకు దోచిపెడుతోందని.. బొగ్గుగనులు, రైల్వేలు, బ్యాంకులు, ఎల్ఐసీ, రక్షణ రంగాన్ని ప్రైవేటీకరించడాన్ని దేశభక్తి అంటారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ, తక్షణమే రైతుభరోసా నిధులు వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని.. రాబోయే కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల పక్షాన పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్, బాల్రెడ్డి, మండ్ల రాజు, లక్ష్మి, గోపీ, జిల్లా కమిటీ సభ్యులు పరమేశ్వరాచారి, మేకల ఆంజనేయులు, ఆర్ఎన్ రమేష్, మండ్ల కృష్ణయ్య, రాజు, వెంకటేష్, బాల్యానాయక్, మహబూబ్పాషా, వెంకటయ్య పాల్గొన్నారు.


