అమరచింత: ఢిల్లీలో జరిగిన జాతీయ హ్యండ్లూమ్ హ్యకథాన్లో పట్టణానికి చెందిన వగ్గు శ్రీరామ్ బుధవారం కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా ప్రథమ బహుమతి అందుకున్నారు. పట్టువస్త్రాల తయారీలో నేతన్నలు వెన్నునొప్పితో బాధపడకుండా ఉండేందుకుగాను శ్రీరామ్ తయారు చేసిన పరికరాన్ని జాతీయస్థాయి ఇన్నోవేషన్లో ప్రదర్శించగా ప్రథమ బహుమతి సాధించింది. ఈ సందర్భంగా అమరచింత పద్మశాలి, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు రఘురాం వగ్గు శ్రీరామ్కు అభినందనలు తెలిపారు.
నిధులు, విధులు
సర్పంచ్లకే ఉండాలి
వనపర్తిటౌన్: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం రావాలంటే విధులు, నిధులు, బాధ్యతలు సర్పంచ్లకే ఉండాలని సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధికార ప్రతినిధి పురుషోత్తంరెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సర్పంచ్ హక్కుల సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో సంసారం చేసేది సర్పంచ్ అయితే అధికారం ఎమ్మెల్యేలకు అప్పజెప్పి గ్రామ స్వరాజ్య వ్యవస్థను ప్రభుత్వాలు నీరుగారుస్తున్నాయని మండిపడ్డారు. విధులు సర్పంచ్లు నిర్వర్తిస్తుంటే నిధులు ఎమ్మెల్యేలకు కేటాయించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమన్నారు. గ్రామానికి, గ్రామసభకు సర్పంచే సర్వాధికారిగా ఉండాలనే నిబంధనకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాల అమలు అధికారం సర్పంచ్లకు కాకుండా ఇందిరమ్మ కమిటీల పేరుతో అనామకులకు అప్పగించడం సరికాదన్నారు. సర్పంచ్, గ్రామకార్యదర్శికి చెక్ పవర్ ఇవ్వకుండా ఏదో ఒక వార్డులో గెలిచిన వ్యక్తిని ఉప సర్పంచ్గా చేసి సర్పంచ్ హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకుంటున్న అనైతిక నిర్ణయాలతో సర్పంచ్ వ్యవస్థ సర్వనాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సర్పంచ్ల గౌరవ వేతనం రూ.25 వేలకు పెంచాలని, అన్ని గ్రామపంచాయతీలకు నిర్వహణ నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రధానకార్యదర్శి బాదేపల్లి సిద్ధార్థ, రాష్ట్ర కార్యదర్శి మందిపల్లి వెంకట్, అధికార ప్రతినిధి, బుద్ధారం సర్పంచ్ శేఖర్ పాల్గొన్నారు.
జాతీయ జెండాల పంపిణీ
వనపర్తిటౌన్: హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లాకేంద్రంలో బీజేపీ నాయకులు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ పిలుపునిచ్చారు. ప్రజలు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ భావాన్ని చాటాలన్నారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ కార్మికులతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు కేతూరి బుడ్డన్న, శ్రీశైలం, మెంటపల్లి పురుషోత్తం, రామన్నగారి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధానకార్యదర్శులు పెద్దిరాజు, శ్రీనివాస్గౌడ్, కల్పన, జిల్లా కార్యదర్శి కాటమోని కృష్ణగౌడ్, ఆఫీస్ సెక్రటరీ దారపోగు సుబ్రమణ్యం, కౌన్సిలర్ విజయ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
కోటిలింగేశ్వర
దత్తక్షేత్రంలో రుద్రహోమం
కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి స్టేజీ సమీపంలో ఉన్న కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో ఆషాడమాస అమావాస్య సందర్భంగా బుధవారం రుద్రహోమం, కోటిలింగాల ప్రతిష్ట మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, రుద్రహోమం జరిగాయి. హోమం కార్యక్రమంలో భక్తులు పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు.


