వనపర్తి: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనుల్లో జాప్యం సరికాదని.. నెలాఖరులోగా బేస్మెంట్ పనులు, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి నిర్మాణం పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులు, మ్యాప్ను పరిశీలించి ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతి, చేపట్టాల్సిన వాటి వివరాలను ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు ఆశించిన స్థాయిలో సాగకపోవడంపై అసంతప్తి వ్యక్తం చేస్తూ పనులు ప్రారంభించి చాలా కాలం గడిచినందున ఇకపై ఎలాంటి జాప్యానికి తావులేదని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన సందర్భంగా నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడంపై ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా పనులు వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాల మేర పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ అంచనాలు పెంచకుండా పనులు నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలన్నారు. చేపట్టాల్సిన ప్రతి పనికి సంబంధించిన స్పష్టమైన కార్యాచరణను సిద్ధం చేసి సమర్పించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ప నుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈఓ యాదయ్య, ఈడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ అధికారులు, ఇతర విద్యాశాఖ అధికారులు ఉన్నారు.


