పాన్గల్: రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ధరలకు అనుగుణంగా మెరుగైన ఫిట్మెంట్తో పాటు 2వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవిప్రసాద్గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మండలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదులో ఆయన పాల్గొని మాట్లాడారు. బకాయిపడ్డ 6 డీఏలను మంజూరు చేయాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ను పునరుద్ధరించాలని కోరారు. ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పింఛన్ అమలు చేయాలని, ప్రాథమిక పాఠశాలలకు శాపంగా మారిన జీఓ నంబర్ 25ను సవరించాలని డిమాండ్ చేశారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్య 50 దాటితే తరగతికి ఒక ఉపాధ్యాయుడి చొప్పున నియమించాలన్నారు. అంతకుముందు ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు మల్లేష్కుమార్, ప్రధానకార్యదర్శి రాముడు, జిల్లా కార్య దర్శి గడ్డం మురళి, సూరయ్య, సంఘం సీనియర్ సభ్యులు శ్రీరాం, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


