వనపర్తి: కృష్ణానదికి భారీగా వరద వస్తున్నా.. రైతులకు సాగునీరు ఇవ్వడం లేదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాగునీటి పారుదల విషయంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా మీడియాతో మాట్లాడటం శోచనీయమని పేర్కొన్నారు. ఎంజీకేఎల్ఐ లిఫ్ట్–1 పంపులను ఈ నెల 1న ప్రారంభించి నీటిని ఎత్తిపోస్తున్నామని తెలిపారు. శ్రీశైలం జలాశయం వెనుక జలాల నుంచి ఇప్పటి వరకు 2.7 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు అధికారిక లెక్కలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎల్లూరు రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 0.355 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 0.34 టీఎంసీలు, సింగోటం రిజర్వాయర్ సామర్థ్యం 0.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.40 టీఎంసీలు, జొన్నలబొగడ రిజర్వాయర్ సామర్థ్యం 2.14 టీఎంసీలు కాగా.. 7వ తేదీ నాటికి 1.753 టీఎంసీల నీటి నిల్వ ఉందని వివరించారు. మూడు పంపులతో ఇన్ఫ్లో 2,400 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 2,100 క్యూసెక్కులుగా నమోదైందన్నారు. కేఎల్ఐ 29 ప్యాకేజీ ఎడమ కాల్వ నుంచి 2,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. వాస్తవాలు కళ్ల ముందు ఉండగా.. మోటార్లు ఇంకా ప్రారంభించలేదని, సాగునీరు ఇవ్వడం లేదని చెప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
ఎల్నినో సాకు సరికాదు : బీఆర్ఎస్
వనపర్తి రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్నినో పేరు చెప్పి పంటలకు నీరు వదలకుండా రోజులు గడుపుతోందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ ఆరోపించారు. శనివారం పెబ్బేరులోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో స్థానిక పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. వ్యవసాయాన్ని పండుగ చేసి చూపిస్తామని తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్పార్టీ నేతలకు వ్యవసాయంపై కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు. ప్రస్తుత వర్షాలకు వస్తున్న వరదను ఎలా వినియోగించుకోవాలనే ధ్యాస కూడా లేదని.. జలాశయాల నుంచి నీరు విడుదల చేసి చెరువులు, కుంటలు నింపి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అనుక్షణం హెచ్చరిస్తున్నా పట్టించుకున్న పాపన పోలేదన్నారు. పంటలు పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుందని కాల్వలకు నీటిని వదలడం లేదని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ 11న నార్లాపూర్ను ముట్టడిస్తామని హెచ్చరించడంతోనే కాల్వలకు నీరు వదిలారన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, నాయకులు కర్రె స్వామి, శంకర్నాయుడు, దిలీప్కుమార్రెడ్డి, వనం రాములు, రాజశేఖర్, సాయినాథ్, మన్యం, సాయిరెడ్డి, వడ్డే రమేష్, తదితరులు పాల్గొన్నారు.
క్రీడా ప్రాంగణం కరువు
● 35 వేల జనాభాకు ఏర్పాటు చేయని వైనం
● వాకింగ్ , రన్నింగ్కు ప్రైవేట్ స్థలాలే దిక్కు
● పట్టని పాలకులు, అధికారులు
వివరాలు 9లో...


