జూరాల, రామన్పాడు జలాశయాల ఆయకట్టు పంటల సాగుతో కళకళలాడుతుంటే.. చారిత్రాత్మక సరళాసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు రైతుల్లో మాత్రం నిరుత్సాహమే కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు ఆయకట్టు కింద దంతనూరు, శంకరమ్మపేట, మదనాపురం, తిరుమలాయ్యపల్లి, అజ్జకొల్లు, రామన్పాడు, చర్లపల్లి, నెల్విడి, నర్సింగాపురం, కొన్నూరు గ్రామాలకు చెందిన సుమారు 4,200 ఎకరాల ఆయకట్టు ఉంది. యాసంగిలో నీటిపారుదలశాఖ అధికారులు ఎలాంటి ముందస్తు ప్రణాళిక, కనీస నియంత్రణ లేకుండా సరళాసాగర్ జలాశయంలోని నీటిని అట్టడుగు భాగం వరకు వదిలారు. కొందరు రైతులు మోటార్లతో ఇష్టానుసారంగా నీటిని తరలించుకుపోతున్నా పట్టించుకోలేదు. ఫలితంగా ప్రాజెక్టు పూర్తిగా ఖాళీ అయింది. ప్రస్తుతం రామన్పాడు నుంచి సరళాసాగర్కు వారం రోజులుగా రెండు మోటార్లతో నీటిని తరలిస్తున్నా ప్రాజెక్టులో కనీసం 10 అడుగుల నీటిమట్టం రావడానికి మరో పదిరోజులకుపైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఆయకట్టుకు నీటిని వదలనున్నారు. ఈలోగా అన్నదాతలకు అత్యంత కీలకమైన వరి నారుమడులు పోసుకునే సమయం పూర్తిగా దాటిపోనుంది. ప్రస్తుతం నాట్లు వేసే సమయం ముగిసిపోతున్న తరుణంలో మొక్కుబడిగా మోటార్లు ప్రారంభించడంతో ఒరిగేదేమి లేదని అన్నదాతలు మండిపడుతున్నారు.


